నోటాకు 54.. చెల్లని ఓట్లు 102
శంకర్పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదంటూ అన్ని వార్డుల్లో కలిపి 54మంది నోటాకు ఓటు వేయగా.. 102ఓట్లు చెల్లుబాటు కాలేదు. నోటాకు అత్యధికంగా 9వ వార్డులో 11 ఓట్లు పడగా, 2వ వార్డులో 18 ఓట్లు చెల్లకుండాపోయాయి. ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతోనే చెట్లుబాటు కాని ఓట్లు నమోదయ్యాయని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. మరోసారైనా ఇలా కాకుండా చూడాలని సూచిస్తున్నారు.
మాజీల గెలుపోటములు
కొందరు విజయం,
మరికొందరు పరా జయం
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఎన్నికల్లో కొందరు మాజీలు గెలుపొందగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కప్పరి స్రవంతి మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్కుమార్ సతీమణి శిరీషపై కౌన్సిలర్గా విజయం సాధించగా, మాజీ వైస్ చైర్పర్సన్ బర్ల మంగ పరాజయం పాలయ్యారు. మాజీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మాజీ కౌన్సిలర్లు భానుబాబు, కొండ్రు శ్రీలత, అల్వాల జ్యోతి, నీలం శ్వేత, ఎదుళ్ళ విజయలక్ష్మి గెలుపొందగా, మాజీ కౌన్సిలర్లు ఆకుల సురేశ్, ఈగల రాములు, భర్తకి జగన్లు ఓటమిపాలయ్యారు. రెండుసార్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా పనిచేసిన కొండిగారి రాములు తనయుడు త్రిలోక్ కుమార్ 12వ వార్డు నుంచి విజయం సాధించారు. తులేకలాన్ మాజీ సర్పంచ్ చిలుకల బుగ్గరాములు ఇబ్రహీంపట్నం 21వ వార్డు కౌన్సిలర్గా విజయం సాధించారు.
ప్రధాన పార్టీకి 12 ఓట్లు!
ఇబ్రహీంపట్నం: పట్టణంలోని 24వ వార్డులో 133 చెల్లని ఓట్లు, నోటాకు 56 ఓట్లు పడ్డాయి. 15వ వార్డులో నోటాకు ఒక్క ఓటు కూడా పడలేదు. 18వ వార్డులో చెల్లని ఓట్లు నమోదుకాలేదు. ఇదిలా ఉండగా, 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కర్నె అరవింద్కు కేవలం 12 ఓట్లు రావడం గమనార్హం.
బీజేపీ పట్టణ అధ్యక్షుడి రాజీనామా
పార్టీ ఓటమికి నైతిక బాధ్యత
వహిస్తూ నిర్ణయం
షాద్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ పటేల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్కు రాజీనామా పత్రం అందజేసినట్లు తెలిపారు. సాధారణ కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి పాటుపడుతానని ప్రకటించారు. ఇదిలా ఉండగా షాద్నగర్లోని 10వ వార్డు నుంచి పోటీచేసిన అతని భార్య భాగ్యలక్ష్మి ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ హరిభూషణ్ పటేల్కు సంబంధించిన ఓ వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


