ఉపకారం.. తాత్సారం!
జిల్లాలో కోట్ల రూపాయలు పెండింగ్ సంక్షోభంలో ప్రైవేటు కళాశాలలు ప్రశ్నార్థకంగా విద్యార్థుల చదువులు ఎదురుచూస్తున్న లక్షల మంది
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వాల నిర్లక్ష్య ధోర ణితో నిరుపేద విద్యార్థులు చదువుకు దూరం కావాల్సిన దుస్థితి నెలకొంది. కళాశాలలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో ఉన్నత విద్య అందని ద్రాక్షలా తయారైంది. పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యాభాస్యం సాగించాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారు. పథకాన్ని అమలు చేయడంలో ఆ తరువాత పాలకులు విఫలమవడంతో అది కాస్తా నీరుగారిపోతోంది. ఫీజులు రాకపోవడంతో ప్రైవేటు విద్యా సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో రూ.కోట్లలో పెండింగ్
పేద విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనాలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకం కోసం ఏటా బకాయిలు విడుదల చేసేవారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గత బీఆర్ఎస్ సర్కార్ నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం దాకా నయా పైసా విడుదల చేయలేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. జిల్లాలో 450 జూనియర్ కళాశాలలు, 472 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో కలిపి లక్షలాదిగా విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏళ్లుగా విడుదల చేయాల్సిన రీయింబర్స్మెంట్ పెండింగ్లో పడిపోయి రూ.2వేల కోట్లకు పైగా చేరిందని చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పెండింగ్లో ఉండడంతో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంసీఏ, ఇంజనీరింగ్ లాంటి చదువులు చదివే సుమారు రెండు లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారింది.
సంక్షోభంలో యాజమాన్యాలు
నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ సొమ్ము విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగామారింది. ఇది ఇలాగే కొనసాగితే తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లి కళాశాలలు మూతపడే పరిస్థితి ఎదురవుతుందని యాజమాన్యాలు వాపోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని అనేక మార్లు కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోతోందని చెబుతున్నారు. నెలవారీ కళాశాల బిల్లులు, జీతాలు చెల్లించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు తప్పని తిప్పలు
అకడమిక్ ఇయర్ పూర్తయినప్పటికీ ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. యాజమాన్యాలు ముక్కు పిండి వారి నుంచి ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయి. చేసేది లేక విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. విద్యార్థి సంఘాలు వారికి మద్దతు పలుకుతూ పోరాటాలకు సిద్ధం అవుతున్నాయి. వెంటనే రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఏళ్లుగా అందనిఫీజు రీయింబర్స్మెంట్
సక్రమంగా అమలు చేయాలి
రీయింబర్స్మెంట్ పథకా న్ని సక్రమంగా అమలు చేస్తే బాగుంటుంది. బోధనా సిబ్బందికి వేతనాలు, చెల్లించలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
– రమేష్గౌడ్, వాసవి విద్యాసంస్థల చైర్మన్
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ప్రభుత్వానికి విద్యా వ్యవ స్థపై చిత్తశుద్ధి లేదు. దేశంలో విద్యాశాఖకు మంత్రి లే ని ప్రభుత్వం తెలంగాణ మాత్రమే. విద్యార్థులకు రా వాల్సిన బకాయిలు విడుదల చేయాలి.
– తరంగ్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి,
ఇబ్రహీంపట్నం


