ధాన్యాన్ని సకాలంలో మిల్లర్లకు పంపాలి
అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని బాచారం, బండరావిరాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సందర్శించారు. ధాన్యం సేకరణను ప్రత్యేక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా సేకరించిన ధాన్యాన్ని నిర్ణీత తేమ స్థాయికి చేరుకున్న వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేస్తూ రైస్ మిల్లర్ రసీదులు సకాలంలో అందేలా చూడాలన్నారు. కొనుగోలు చేసిన 48 గంటలలోపే రైతులకు చెల్లింపులు జరగాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వసతులు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లర్లకు పంపించాలని, తూకం వేసి మిషన్లు, గన్ని బ్యాగులను టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లిలోని జయలక్ష్మి రైస్ మిల్లును తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ వెంట డీసీఎస్ఓ వనజాత, డీఎంఓ హరీశ్, తహసీల్దార్ సుదర్శన్రెడ్డిలతో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి


