ఆగిన ‘పరీక్షలు’!
టీహబ్ సెంటర్లో పాడైన యంత్రాలు నిధుల విడుదలనుపట్టించుకోని ప్రభుత్వం పది రోజులుగా రోగులకుఅందని వ్యాధి నిర్ధారణ రిపోర్టులు టెస్టుల కోసం ప్రైవేటుకుపంపిస్తున్న వైద్యులు వేలాది రూపాయలు ఖర్చువుతున్నాయని బాధితుల ఆవేదన
తాండూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నాస్టిక్ సెంటర్లోని యంత్రాలు పాడయ్యాయి. ఫలితంగా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాల రిపోర్ట్లు అందడం లేదు. అవి వస్తేనే వైద్యసేవలు చేస్తామని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పది రోజులుగా రోగులను ప్రైవేటు డయాగ్నాస్టిక్ సెంటర్లకు పంపిస్తున్నారు. వారం రోజుల క్రితం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేసిన సమయంలో టెస్టుల కోసం బయటకు పంపిస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో కేవలం పరీక్షల కోసమే తనకు రూ.4 వేలకు పైగా ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈవిషయమై ఆరా తీయగా వికారాబాద్లోని టీహబ్ సెంటర్లో మిషన్లు మరమ్మతులకు గురయ్యాయని, పది రోజులుగా రిపోర్టులు రావడం లేదని తేలింది. జిల్లాలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4ఏరియా ఆస్పత్రులు, బస్తీ దవాఖానాలు, అర్బన్ ఆస్పత్రులతో పాటు తాండూరులో జిల్లా ఆస్పత్రి, మాతాశిశు ఆస్పత్రి కొనసాగుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్ల క్రితం తెలంగాణ డయాగ్నాస్టిక్ హబ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీహబ్ పేరుతో ఏర్పాటు చేసిన కేంద్రానికి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులను అనుసంధానం చేశారు. వీటిలోని రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలను టీహబ్కు తరలించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అనంతరం రోగుల సెల్ఫోన్ నంబర్లకు నేరుగా రిపోర్టులు పంపిస్తారు. అయితే టీ హబ్ డయాగ్నాస్టిక్ సెంటర్ నిర్వహణ లోపంతో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టీ హబ్ ద్వారా 57 రకాల పరీక్షలు చేసుకొనే వెసులుబాటు ఉంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన కేంద్రం నిర్వహణకు కాంగ్రెస్ సర్కార్ నిధులు కేటాయించడం లేదు.
ఉన్నతాధికారులకు నివేదించాం
టీ హబ్ సెంబర్లో విద్యు త్ సరఫరా సరిగా లేకపోవడంతో ఖరీదైన సాంకేతిక యంత్రాలు తరచూ పాడవుతున్నాయి. సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు నివేదించాం. పది రోజుల క్రితం మిషన్లు మరమ్మతులకు చేరుకోవడంతో టెక్నీషియన్లను పిలిపించి బాగు చేయించాం. రెండు రోజులు తిరక్కుండానే మళ్లీ పాడయ్యాయి.
– రవీంద్రయాదవ్,
డిప్యూటీ డీఎంహెచ్ఓ, టీ హబ్ ఇన్చార్జ్
ఆగిన ‘పరీక్షలు’!


