
పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము
తాండూరు రూరల్: పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిదని పెద్దేముల్ ఎస్ఐ వేణుకుమార్ అన్నారు. మంగళవారం పోలీస్స్టేషన్లో పని చేసి బదిలీపై వెళ్లిన కానిస్టేబుళ్లను ఆయన శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. అన్ని ఉద్యోగాల కంటే పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నాదన్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి వారికి రక్షణ కల్పించాలన్నారు. బదిలీపై వెళ్లిన కానిస్టేబుల్ మాసయ్య, రవి, సంతోష్, ధనరాజ్ల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రమేశ్, రఫీక్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొప్పు బాషా
యాచారం: గ్రామానికి చెందిన కొప్పు బాషా బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆయన 2000 సంవత్సరం నుంచి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేవైఎంలలో కీలక పదవులు నిర్వర్తించారు. ఈ క్రమంలో తన సతీమణి సుకన్యను యాచారం ఎంపీపీగా పదవీలో కూర్చోబెట్టారు. అనంతరం బండి సంజయ్ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కులాల్లోని ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిన రాజీలేని పోరాటం చేశారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం తాజాగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు మంగళవారం తన నివాసంలో పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొప్పు బాషా మాట్లాడుతూ... పార్టీ అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు.
వ్యక్తి బలవన్మరణం
షాద్నగర్రూరల్: ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ వ్యక్తి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం పట్టణ శివారులోని కీర్తి వెంచర్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపిన ప్రకారం.. ఫరూఖ్నగర్లోని వివేకానంద కాలనీకి చెందిన చాపల గోపాల్(39) ఓ పెట్రోల్ పంపులో పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు లేక పోవవడం, అవివాహితుడు కావడంతో తన అన్న శేఖర్వద్దే ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, పెళ్లి కాకపోవడంతో మనస్థాపంతో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మంగళవారం కీర్తి వెంచర్ సమీపంలో రైలు కిందపడి ఆతహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధార్కార్డు, ఏటీఎం కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
రైతు ఆత్మహత్య
బషీరాబాద్: మతిస్థిమితం లేని ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బషీరాబాద్ మండలం మంతట్టిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నుమాన్అలీ తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన తలారి హన్మప్ప(63) వ్యవసాయం చేసేవాడు. కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కొడుకు నర్సింలుతో కలిసి పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. నర్సింలు పంపులో నీళ్లు నింపేందుకు బోరుమోటారు వద్దకు వెళ్లగా.. హన్మప్ప పురుగుల మందు తాగాడు. కొడుకు వచ్చేసరికి నురగలు కక్కుతుండటంతో 108లో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య తుల్జమ్మ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఏఎంసీ చైర్మన్ల ఫోరం అధ్యక్షుడిగా పెంటయ్యగౌడ్
చేవెళ్ల: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా చేవెళ్ల ఏఎంసీ చైర్మన్ జి.పెంటయ్యగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నగరంలో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లా కమిటీ ఎన్నిక నిర్వహించారని చెప్పారు. చైర్మన్గా టి.మల్లేశ్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడిగా కె.వేణుగౌడ్, ప్రధాన కార్యదర్శిగా జి.మాధవరెడ్డి, జాయింట్ సెక్రటరీగా బి.ఆంజనేయులు ఎన్నికయ్యారని చెప్పారు. నూతన కమిటీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిశామన్నారు.

పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము

పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము