
జన్మన్ జాడేదీ..!
● పథకం అమలులో నిర్లక్ష్యపు నీడ ● చెంచుల అభ్యున్నతికి కేంద్రం తెచ్చిన ప్రత్యేక స్కీం ● ప్రారంభించి ఏడాది గడిచినా సాగని పనులు ● జిల్లాలో 22 ఆవాసాల్లో చెంచుల నివాసం ● 740 కుటుంబాలు, 2,554 మంది జనాభా
వికారాబాద్: చెంచుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జన్మన్ కార్యక్రమం ముందుకు సాగడంలేదు. ప్రధాన మంత్రి జన జాతీయ ఆదివాసి న్యాయ అభియాన్ (పీఎం జన్మన్) పేరుతో కేంద్రం గతేడాది క్రితం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. చెంచు గూడేలు, వారి జీవితాల్లో సమూల మార్పులు తేవడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నారు. స్కీం ప్రారంభించే ముందు వారి స్థితిగతులు తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. జిల్లాలో 22 ఆవాసాల్లో చెంచులు నివసిస్తుండగా 740 కుటుంబాలు, 2,554 మంది ఉన్నట్లు గిరిజన సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 42 అంశాలపై సర్వే నిర్వహించి వివరాలు సేకరించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యి ఏడాది దాటినా ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. కార్యక్రమం కాస్త సర్వేకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పథకంలో పొందుపర్చిన అంశాలు
పీఎం జన్మన్ పథకంలో చెంచుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక అంశాలను పొందుపర్చారు. ముందుగా వారి వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు 42 అంశాలతో కూడా సమాచారం సేకరించారు. ప్రధానంగా వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సదుపాయాల్లో ఇప్పటి వరకు ఏవేవి కలిగి ఉన్నారు..? ఇంకా ఏవేవి కల్పించాల్సి ఉంది..? అనే అంశాలను ఈ సర్వే ద్వారా తెలుసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. చెంచు కుటుంబాలకు పక్కా ఇళ్లు ఉన్నాయా..? ఇంటికి కులాయి ఉందా లేదా..? లాంటివి తెలుసుకున్నారు. ప్రతి చెంచు ఆవాసానికి రహదారి, ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, అందరికి నాణ్యమైన విద్య లాంటివి ఈ పథకం ద్వారా అందించాలని నిర్ణయించారు. వృత్తి విద్యా నైపుణ్యం, అందరికీ ఆరోగ్యం, పోషణ, మెరుగైన టెలీఫోన్ సౌకర్యం తదితర కార్యక్రమాల ద్వారా జీవనోపాధి మెరుగు పర్చడం లాంటివి ఈ కార్యక్రమంలో చేపట్టనున్నారు. ఉచిత నిత్యావసరాలు, ఉచిత ఎల్పీజీ కనెక్షన్, గర్భిణులకు ఆర్థిక సాయం, సుకన్య సంవృద్ధి యోజన, వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తదితర పథకాలన్నీ అందుతున్నాయా లేదా..? తెలుసుకుని వాటన్నింటిని అందేలా చూడటం ఈ పథకం ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకాన్ని తెలంగాణతోపాటు 28 రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.24 వేల కోట్లు వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే స్కీం ప్రారంభించి ఏడాది గడిచినా ఇంకా కార్యక్రమాలేవి చేపట్టకపోవటం విమర్శలకు తావిస్తోంది.
వైఫల్యాలు పునరావృతం కాకుంటేనే..
చెంచుల అభ్యున్నతి కోసం తపపెట్టిన ఈ పథకంలో గత అనుభవాలు, వైఫల్యాలు పునరావృతం కాకుండా చూసుకోగలిగితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలోనూ ప్రభుత్వాలు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలు తీసుకువచ్చినా ఆ కుటుంబాలల్లో ఆశించిన మార్పు రాలేదు. వారు అన్ని రంగాల్లో రాణించాలంటే మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారిలో సామర్థ్యాల పెంపుదలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని పలువురు అభిప్రాయపడ్డారు.. లేకుంటే ఇలాంటి ఎన్ని పథకాలు వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండన్నారు.