
ప్రజలను చైతన్య పరచాలి
డీఈఓ రేణుకాదేవి
అనంతగిరి: మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ఉపాధ్యాయులు తమ వంతుగా ప్రజలను చైతన్య పరచాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. శుక్రవారం వికారాబాద్లోని డైట్ కళాశాలలో కస్తూర్బా గాంధీ, ఆదర్శ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు మానవ అక్రమ రవాణాను అరికట్టడంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ఉపాధ్యాయులు మానవ అక్రమ రవాణా అరికట్టడంలో తమ వంతు పాత్ర వహించాలన్నారు. మానవ అక్రమ రవాణా సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1098, 100, 181, 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో స్వ చ్ఛంద సంస్థ రిసోర్స్ పర్సన్ శ్రీకాంత్, సుప్రియ శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాలు మెరుగు పర్చుకోవాలి
పూడూరు: ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలను మెరుగు పర్చుకుని బోధన చేయాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. శుక్రవారం మండలంలోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ వీరయ్య, కోర్సు డైరెక్టర్ సాయిరెడ్డి, మానిటరింగ్ అధికారి రామ్ మస్తాన్, సెక్టోరియల్ అధికారి రమేష్, డీఆర్పీలు రవికుమార్, బాల్రాజ్ పాల్గొన్నారు.