పంట మార్పిడితో మేలు | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడితో మేలు

May 30 2025 6:59 AM | Updated on May 30 2025 6:59 AM

పంట మ

పంట మార్పిడితో మేలు

పరిగి: ఒకే రకమైన పంటల సాగుతో భూసారం క్రమంగా తగ్గుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా దిగుబడి క్షీణించి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఒకే నేలలో సాగు చేసే పంటలను తరచూ మార్చాలని సూచిస్తున్నారు. పంట మార్పిడి చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుంది. సంవత్సరం పంట మార్పిడి చేయడంతో సాగు చేసిన పంట ఆరోగ్యంగా ఉండటంతో పాటు మంచి దిగుబడిని ఇస్తుంది. నేలలో సైతం సమృద్ధిగా పోషకాలు వృద్ధి చెంది పంట దిగుబడులు పెరిగే ఆస్కారం ఉందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

చీడపీడలకు అడ్డుకట్ట

● ఒక పంటను ఒకే పొలంలో వరుసగా పండించడం వల్ల చీడపీడల ఉద్ధృతి అధికం కావడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

● పురుగు జీవితచక్రం నిరాటంకంగా ముగించుకుని తీవ్రమైన హాని కలిగించే స్థితికి చేరుకుంటుంది.

● పంట మార్పిడి చేసినప్పుడు పురుగు జీవితచక్రం ఛేదించబడుతుంది. ఎందుకంటే ఒక పంటపై ఆశించే పురుగులు మరొక పంటపై ఆఽశించడం సాధారణంగా జరగదు.

● వేగంగా వృద్ధి చెందే కొన్ని రకాల పురుగులను పంటమార్పిడి వల్ల అదుపులో పెట్టవచ్చు.

● ఒకే లోతు వ్యవస్థ కలిగిన పంటలను ఉదాహరణకు పత్తి, మిరప, మొదలైన వాణిజ్య పంటలను మార్పిడి చేయకుండా సాగు చేయడం వల్ల ఒకే లోతు పొరల నుంచి పోషకాలు తీసుకోవడంతో నేల నిస్సారమవుతుంది.

● వరి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వంటి పైర్లు నేలపై పొరల నుంచి పోషకాలను తీసుకుంటాయి.

● నేల భౌతిక లక్షణాలు స్వభావం దెబ్బతినకుండా ఉండటానికి చీడపీడల అభివృద్ధిని నిరోధించడానికి పంటమార్పిడి చేయాలి.

● అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి పశుగ్రాసం కోసం గడ్డిజాతి పైర్లు భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలి.

ప్రయోజనాలు ఇవే!

● వరి తర్వాత మినుము, పెసర, శనగ వేయడంతో సుడి దోమ, టుంగ్రో వైరస్‌ నివారించవచ్చు.

● పత్తి వేసిన పొలంలో మొక్కజొన్న, జొన్న, నువ్వులు, మినుములు వేస్తే లద్దె పురుగు, పచ్చపురుగుల బెడద ఉండదు.

● జొన్న, మొక్కజొన్న తర్వాత కంది సాగు చేస్తే కాయతొలుచు పురుగు ఉద్ధృతి తగ్గుతుంది.

● వరి సాగు చేసే పొలాల్లో ముందుగా పప్పు ధాన్యాలను సాగు చేయడంతో నేల సారవంతమవుతుంది.

● వేరుశనగలో ఆకు ముడతను నివారించేందుకు పప్పుజాతికి చెందిన పైర్లతో మార్పిడి చేయాలి.

● కంది మిరప పంటల్లో ఎండుతెగులు నివారణకు జొన్న, మొక్కజొన్న పంటలతో మార్పిడి చేయాలి.

● నులి పురుగు సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ, మిరప వంటి పైర్ల సాగును కొన్ని పంట కాలాల వరకు ఆపాలి.

● ఆహార పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ పైర్లను పప్పుజాతి పైర్లయిన పెసర, మినుము, వేరుశనగ, పంటలతో మార్పిడి చేయాలి.

● ఆహార వాణిజ్య పంటలను పశుగ్రాస పైర్లతో ఒకసారి పప్పుజాతి పైర్లతో మరోసారి మార్పిడి చేయడం లాభదాయకం.

రైతులు అధిక దిగుబడి పొందే అవకాశం

నేలలో పెరగనున్న భూసారం

వ్యవసాయ అధికారుల సూచన

అధిక దిగుబడి

రైతులు ఒకే పంటను తరచూ సాగు చేయరాదు. ఒకే రకమైన పంటలను సాగు చేయడంతో మొక్కలకు అవసరమైన పోషకాలు అందక దిగుబడులు తగ్గిపోతాయి. అంతే కాకుండా రోగకారక పురుగుల జీవితచక్రం ముగించుకుని రోగాలు ఉద్ధృతి పెరుగుతుంది. అంతుకే రైతులు వరుసగా ఒకే రకమైన పంటను సాగు చేయరాదు.

– లక్ష్మీకుమారి, ఏడీఏ, పరిగి

పంట మార్పిడితో మేలు1
1/1

పంట మార్పిడితో మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement