
ఎదురెదురు బైకుల ఢీ
ఇద్దరికి తీవ్ర గాయాలు
ధారూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లిపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్(35) హైదరాబాద్లోని లంగర్హౌస్ పీఎస్లో ట్రాఫిక్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పెద్దేముల్లో తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై తిరిగి స్వగ్రామానికి బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ధారూరుకు చెందిన రోహిత్, రాము, నర్సింహ అనే యువకులు ఒకే బైక్పై రుద్రారం వైపు వెళ్తూ.. మార్గమధ్యలో డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద అబ్దుల్ బైక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను వికారాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అబ్దుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రోహిత్కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు సైతం గాయపడ్డారు.
పోగొట్టుకున్న ఫోన్ల అందజేత
నవాబుపేట: ఎవరైనా ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా నేరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నవాబుపేట ఎస్ఐ అరుణ్కుమార్ సూచించారు. మండల పరిధిలోని ఆర్కతల గ్రామానికి చెందిన పవన్, బాల్రెడ్డిగూడకు చెందిన సునీతలు 15 రోజుల క్రితం వారి ఫోన్లు పోగొట్టుకున్నారు. సీఈఐఆర్ ద్వారా వారి ఫోన్లను రికవరీ చేసి గురువారం బాధితులకు ఎస్ఐ అందజేశారు. నేటి సాంకేతిక యుగంలో పోగొట్టుకున్న వస్తువులను తొందరగా తెలుసుకోవచ్చన్నారు.
ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్లాట
పరిగి: ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికులు కొట్టుకున్న ఘటన గురువారం పరిగి–వికారాబాద్ బస్సులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి– వికారాబాద్ మార్గంలో వికారాబాద్ డిపోకు చెందిన బస్సులు నడుస్తుంటాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువైనా బస్సులు పెంచకపోవడంతో నిత్యం కిటకిటలాడుతూ వెళ్తుంటాయి. గురువారం పరిగి నుంచి వికారాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎక్కాడు. సీటు విషయంలో ఇరువురు గొడవ పడ్డారు. దీంతో రెండు కుటుంబాలకు చెందిన మహిళలు, పురుషులు, మరో ప్రయాణికుడు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ప్రయాణికుల రద్దీ కారణంగానే కొట్లాట జరుగుతుందని, బస్సుల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు.
పిడుగుపాటుకు ఆవు మృతి
దోమ: పిడుగుపాటుకు ఓ ఆవు మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని కొత్తపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజమోని రాజు జీవనోపాఽధి కోసం ఆవులను కొనుగోలు చేశారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఓ ఆవుపై పిడుగు పడింది. గురువారం తెల్లవారుజామున పొలానికి వెళ్లిన బాధిత రైతు ఓ ఆవు మృతి చెందడంతో కన్నీటి పర్యాంతమయ్యారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు.
షార్ట్ సర్క్యూట్తో హోటల్ దగ్ధం
షాద్నగర్రూరల్: షార్ట్ సర్క్యూట్తో ఓ హోటల్ దగ్ధమైన సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలిచంద్రయ్య హోటల్ నిర్వహిస్తూ జీవనోపాధిని పొందుతున్నాడు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే హోటల్ను మూసివేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తరువాత షార్ట్ సర్క్యూట్ కావడంతో హోటల్లోని సామగ్రి, వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గురువారం తెల్లవారుజామున చంద్రయ్య చూడగా దట్టమైన పొగతో నిండిపోయింది. హోటల్లోని ప్రిడ్జ్లు, కౌంటర్లు, కంప్యూటర్, ప్రింటర్, సీసీ కెమెరాల ఎక్విప్మెంట్, ప్యాన్లు, కుర్చీలు, కూల్ డ్రింక్, వాటర్ బాటిళ్లు పూర్తిగా కాలిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న ఆర్ఐ సలీం, పంచాయతీ కార్యదర్శి తేజస్విని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ షార్ట్ సర్క్యూట్తో దాదాపు రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు హోటల్ యజమాని చంద్రయ్య తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు.

ఎదురెదురు బైకుల ఢీ

ఎదురెదురు బైకుల ఢీ