
జూన్ 3నుంచి కంది విత్తనాల పంపిణీ
తాండూరు: తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో 365 క్వింటాళ్ల కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయని.. జూన్ 3న సబ్సిడీపై రైతులకు పంపిణీ చేయనున్నట్లు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. టీడీఆర్జీ 59 రకం కంది విత్తనాలు 350 క్వింటాళ్లు, ఆశ ఐసీపీఎల్ 87119 రకం 15 క్వింటాళ్లు ఉన్నాయన్నారు. 4 కిలోల బస్తాను రూ.600కు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆశ రకం నల్లరేగడి, నీటి వసతి ఉన్న భూముల్లో విత్తుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ రకం ఎండు తెగులు, వెర్రి తెగులు, గొడ్డు తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని వివరించారు. విత్తనాలు కావాల్సిన రైతులు జూన్ 3న తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.
మహనీయుడు వీర సావార్కర్
బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి
తాండూరు టౌన్: బ్రిటీష్ రాచరిక పాలనకు వ్యతిరేకంగా దేశంలోని హిందువులను ఏకం చేసిన మహనీయుడు వీర సావార్కర్ అని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం అన్నారు. బుధవారం తాండూరులో పార్టీ ఆధ్వర్యంలో సావార్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత సంపూర్ణ స్వాతంత్య్రం కోసం యూకేలో చదువుతున్న ఆయన పలు విప్లవ సంస్థలతో సంబంధాలు ఏర్పర్చుకుని బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా హిందువులను ఏకం చేశారన్నారు. దీంతో బ్రిటీష్ వారు ఆయనను అరెస్టు చేసి ఇండియాకు తీసుకువచ్చి అండమాన్ దీవుల్లోని సెల్యులార్ జైలుకు పంపారన్నారు. జైలు నుంచి విడుదలైన ఆయన హిందూ జాతీయ వాదాన్ని సమర్థిస్తూ స్వాతంత్య్రం కోసం పోరాడాడన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రజినీ కాంత్, మంతటి రాజు, ప్రకాష్, ప్రహ్లాద్, షాబుద్దీన్, శివాజీ, తాండ్ర నరేష్ పాల్గొన్నారు.
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి
తాండూరు: క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని విలియంమూన్ మైదానంలో జీఎంకే బిల్డర్ అండ్ డెవలపర్స్ అధినేత ముజీబ్ఖాన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. సమాజ సేవ అలవాటు చేసుకోవాలన్నారు. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 40 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

జూన్ 3నుంచి కంది విత్తనాల పంపిణీ