
రైతులకు నష్టం కలిగించొద్దు
అనంతగిరి: వర్షాలు పడుతున్నందన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పడు ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ధాన్యం తడిసి రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాల్సి బాధ్యత మనపై ఉందని అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం సేకరణ, రవాణాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున ధాన్యం ఆరబెట్టుకోవడం రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నా అన్నదాతలకు నష్టం జరగకుండా సేకరించిన వడ్లను మిల్లర్లకు తరలించాలని ఆదేశించారు. ఇందుకోసం లారీలు, హమాలీలను సమకూర్చుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీఎంసీఎస్ రాము, రవాణా శాఖ జిల్లా అధికారి వెంకట్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు, ట్రాన్స్పోర్టర్లు పాల్గొన్నారు.
తడిసినా కొనుగోలు చేయాలి
ధారూరు: ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున ధాన్యం తడిసినా సేకరించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. బుధవారం ధారూరు వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. అక్కడ రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరిస్తున్న హరిదాస్పల్లి పీఏసీఎస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే సేకరించిన వడ్ల బస్తాలను వెనువెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, సీఈఓ రవి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం బస్తాలను తక్షణం మిల్లులకు తరలించండి
కలెక్టర్ ప్రతీక్ జైన్