
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
తాండూరు రూరల్: వీర్శెట్టిపల్లి గ్రామంలో కొందరు అక్రమార్కులు పట్టపగలు వాగులో నుంచి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మంగళవారం వీర్శెట్టిపల్లి గ్రామానికి చెందిన పరుశురాం వాగులో నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో గోనూర్ గేటు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్నారు. ట్రాక్టర్కు ఎలాంటి పర్మిషన్ లేకపోవడంతో పాటు నంబర్ కూడా లేదు. దీంతో ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించి యజమాని పరశురాంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
కేసులకు భయపడేది లేదు
తాండూరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ నాయకులు దహనం చేశారు. ఈ ఘటనలో పట్టణ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో హాజరైన అనంతరం బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, పట్టణాధ్యక్షుడు సందీప్ రెడ్డి, నాయకు లు వినోద్, నర్సింహులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరిత కేసులు బనాయించడం సిగ్గు చేటన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటామని, సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
నివాళి
బషీరాబాద్: ఏకాంబరి రామలింగేశ్వర ఆలయ ప్రధాన కార్యదర్శిగా సుధీర్ఘకాలం పనిచేసిన ఆచారి నర్సిములు(75) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. నీళ్లపల్లికి చెందిన ఆయన ఆలయ పరిసరాల్లో ఇల్లు నిర్మించుకుని చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నారు. శాసన మండలి చైర్మన్ పట్నం మహేందర్రెడ్డి నీళ్లపల్లికి చేరుకొని నర్సిములు మృతదేహానికి నివాళులర్పించారు.
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్టు
మూసాపేట: గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన విక్రాంత్ రెడ్డి కూకట్పల్లిలోని హాస్టల్లో ఉంటూ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. భూపాలపల్లి జిల్లాకు చెందిన దీక్షిత్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన అభినయ్, మంచిర్యాలకు చెందిన అన్షు అతడి స్నేహితులు. గంజాయికి అలవాటు పడిన వీరు గంజాయిని కొనుగోలు చేసి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వారికి పరిచయమైన అనురాగ్, వినయ్ కూడా వారితో జత కలిశారు. దీంతో వారు 10 కేజీల గంజాయిని కొనుగోలు చేసి తీసుకువచ్చారు. కూకట్పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక టీస్టాల్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా నిందితుల్లో ఒకరైన అభినయ్ 2024లో బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని, మిగిలిన ముగ్గురూ ఖాజీపేట పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అనురాగ్, వినయ్ కోసం గాలిస్తున్నామన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇసుక ట్రాక్టర్ పట్టివేత