
ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం
నవాబుపేట: ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టిగిద్ద గ్రామానికి చెందిన బక్కని ఏసు కొడుకు సందీప్(23), వికారాబాద్లో ఐటీఐ చదువుతున్నాడు. ఏడాది క్రితం పట్టణానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది. అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన సందీప్ గత సోమవారం సాయంత్రం తమ పొలంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు.
ఉపాధి కూలీ మృతి
యాలాల: ఉపాధి పనులు చేస్తుండగా గుండెపోటు రావడంతో ఓ కూలీ మృతిచెందాడు. వికారాబాద్ జిల్లా తిమ్మాయిపల్లిలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన అన్నారపు హన్మంతు(38) భూమి చదును పనుల్లో పాల్గొన్నాడు. ఈసమయంలో ఛాతిలో నొప్పి వస్తోందంటూ ఒక్కసారిగా కుప్పకూలి, అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. సమాచారం అందుకున్న ఉపాధి సిబ్బంది, అక్కడికి వెళ్లి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేశామని తెలిపారు.
బ్యాటరీల దొంగ దొరికాడు
కేశంపేట: మండలంలో ఇటీవల చోరీ అయిన బ్యాటరీలను పోలీసులు రికవరీ చేశారు. మండల పరిధిలోని లేమామిడి, కేశంపేట, బైర్కాన్పల్లి గ్రామాల్లో ఇటీవల వాహనాల బ్యాటరీలతో పాటు జనరేటర్ బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఇదే విషయమై బాధితుల నుంచి పోలీసులకు నాలుగు ఫిర్యాదులు అందాయి. పోలీసులు బ్యాటరీ దొంగతనాలను ఛేదించేందుకు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమోరాల్లో నమోదైన పుటేజీలతోపాటు వివిధ కోణాల్లో సమాచారం సేకరించారు. హైదరాబాద్ విద్యానగర్లోని లక్ష్మీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మేగిశెట్టి నాగేశ్వర్రావు బ్యాటరీలను దొంగిలించినట్టు గుర్తించారు. అతడి నుంచి 12 బ్యాటరీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం