
ముందస్తు అరెస్టులు బాధాకరం
కుల్కచర్ల: ముందస్తు అరెస్టులు బాధాకరమని మాజీ సర్పంచులు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులను ఇవ్వాలని ప్రశ్నిస్తే అరెస్టులు చేయించడం సబబు కాదని కుల్కచర్ల మండల, ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మణ్, తుల్జ్యా తదితరులు పేర్కొన్నారు. మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించాలని లేనియెడల ఉప ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటామని రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక పోలీస్ అధికారులు మంగళవారం వారిని ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత ప్రభుత్వ పాలనలో సర్పంచులుగా తాము ఎంతో కృషి చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో తమను ప్రత్యేకంగా గుర్తించకపోగా తమను అరెస్టులు చేయడం ఏంటని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అరెస్టయిన వారిలో రవి, లోక్య పాల్గొన్నారు.
అరెస్టులు అప్రజాస్వామికం
దోమ: గత ప్రభుత్వంలో అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం అప్రజాస్వామికమని సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. మంగళవారం దోమ మండలం నుంచి ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వారిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని గొప్పలు చెప్పుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,600 పైచిలుకు గ్రామ పంచాయతీలకు దాదాపు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ. పన్నెండు వందల కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రభుత్వ పెద్దలే వెల్లడిస్తున్నారు. అయినప్పటికీ ఇటీవల విడుదల చేసిన నిధులు ఏ గ్రామ పంచాయతీకి విడుదలయ్యాయో ప్రభుత్వ పెద్దలే చెప్పాలన్నారు. దాదాపు పది వేల పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించామని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినప్పటికి నేటికి కూడా పరిగి నియోజకవర్గానికి ఒక్క రూపాయి విడుదల కాలేదని విమర్శించారు. ఇప్పటికై నా మాజీ సర్పంచుల బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.