
నేటి నుంచి పురాతన నాణేలు, కరెన్సీ నోట్ల ఎగ్జిబిషన్
చార్మినార్: పాతబస్తీలో రెండు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ నాణేలు, కరెన్సీ నోట్లు, పురాతన వస్తువులు సేకరణల ప్రదర్శన శనివారం ప్రారంభం కానుంది. సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించే ఈ ఎగ్జిబిషన్ పాతబస్తీ ఉర్దూ ఘర్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అరుదైన నాణేలు, పేపర్ కరెన్సీ, స్టాంపులు, పెయింటింగ్ల ప్రదర్శన, చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 7వ శతాబ్దం నాటి అంతర్జాతీయ నాణేలు, కరెన్సీని ప్రదర్శించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హై ఖాద్రి తెలిపారు. నాణేలు, పేపర్ కరెన్సీ, స్టాంపులు, పెయింటింగ్లతో పాటు ఇతర పురాతన వస్తువుల మిశ్రమ కలయిక గల వస్తువులను ఈ ఎగ్జిబిషన్లో సందర్శకులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. మరిన్ని వివరాల కోసం సొసైటీ కార్యదర్శి లేదా డైరెక్టర్ సిరాజుద్దీన్లను 8500212306 నెంబర్లో సంప్రదించాలని కోరారు.