మేనకోడలే మాస్టర్‌ మైండ్‌ | - | Sakshi
Sakshi News home page

మేనకోడలే మాస్టర్‌ మైండ్‌

May 5 2025 8:26 AM | Updated on May 5 2025 8:26 AM

మేనకోడలే మాస్టర్‌ మైండ్‌

మేనకోడలే మాస్టర్‌ మైండ్‌

మేనత్త ఇంట్లోదోపిడీ చేయించిన వైనం

అద్దె పేరుతో ఇంట్లోకి చొరబడి చోరీ

మేనకోడలితో పాటు మరోఇద్దరు నిందితుల రిమాండ్‌

సికింద్రాబాద్‌: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలైన మేనత్తను టార్గెట్‌ చేసి ఆమె ఇంట్లో దోపిడీ చేయించిన మేనకోడలి ఉదంతమిదీ. ఇల్లు అద్దెకు కావాలన్న నెపంతో వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు ఆమెను బంధించి నగలు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన కేసులో మిస్టరీ వీడింది. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు ఆగంతకులతో పాటు సూత్రధారిగా వ్యవహరించిన బాధితురాలి మేనకోడలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ బాలస్వామి, చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌ పార్శిగుట్టలో పారిజాతం (60) అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఈనెల 2న మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలంటూ పారిజాతం ఉంటున్న మొదటి అంతస్తుకు వచ్చారు. ఆమె తేరుకునే లోపే ఇంట్లోకి చొరబడి తలుపులు గడియపెట్టి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేశారు. నోటికి ప్లాస్టర్‌ వేసి సెల్‌ఫోన్‌, రూ.6వేల నగలు, 30 గ్రాముల బంగారు ఆభరణాలను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలు వెళ్లిపోయిన తర్వాత కట్లు విప్పుకుని బయటికి వచ్చిన పారిజాతం స్థానికుల సహాయంతో వారాసీగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా...

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ముషీరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో స్వీపర్‌గా పని చేస్తున్న శ్రీకాంత్‌, బన్సీలాల్‌పేట్‌కు చెందిన ఎలక్ట్రీషియన్‌ ఈశ్వర్‌లను నిందితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ బంధువు పార్శిగుట్టకు చెందిన క్యాటరింగ్‌ వర్కర్‌ ఆళ్ల జ్యోతి సూచన మేరకే తాము పారిజాతం ఇంట్లో దోపిడీకి పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. దీంతో జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా తన మేనత్త ఒంటరిగా ఉంటున్న విషయం తనకు తెలుసునని డబ్బు కోసమే శ్రీకాంత్‌ను దోపిడీకి పురమాయించినట్లు తెలిపింది. నిందితుల నుంచి సెల్‌ఫోన్‌, నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేవలం డబ్బు కోసం మాత్రమే వీరు చోరీకి పాల్పడినట్లు తెలిపారు. వారికి ఎలాంటి నేరచరిత్ర లేదన్నారు. రెండు రోజుల్లోనే కేసును చేధించి నిందితులను అదుపులోకి తీసుకున్న ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌, ఎస్‌ఐలు సుధాకర్‌, ప్రకాశ్‌రెడ్డి, కానిస్టేబుళ్లు గాలేబ్‌, దస్తగిరి, వేణు, రామకృష్ణ తదితరులకు డీసీపీ అవార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement