
ధారూరు మార్కెట్కు పోటెత్తిన ధాన్యం
ధారూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్కు శనివారం 5,334 బస్తాల 1010 రకం వడ్లు వచ్చాయని ఏఎంసీ కార్యదర్శి సిద్దమ్మ తెలిపారు. క్వింటాలుకు రూ.1,940 నుంచి రూ.2 వేల వరకు ధర పలికినట్లు చెప్పారు. మొక్కజొన్న 1,787 బస్తాలు వచ్చాయని, క్వింటాలుకు రూ.2,225 నుంచి రూ.2,340 వరకు, సోనారకం వడ్లు 165 బస్తాలు వచ్చాయని, క్వింటాలుకు రూ.2,250 నుంచి రూ.2,230 వరకు, కందులు 97 బస్తాలు వచ్చాయని, క్వింటాలుకు రూ.6,150 నుంచి రూ.7,050 వరకు ధర పలికిందని ఆమె వివరించారు. అలాగే పసుపులో కాడి రకం 59 బస్తాల వచ్చాయని, క్వింటాలుకు రూ.8,900 నుంచి రూ.12 వేల వరకు, పసుపులో గుండు రకం 10బస్తాలు రాగా క్వింటాలుకు రూ.11,500 వేల నుంచి రూ.12,200 వరకు అమ్మకాలు జరిగాయని ఆమె తెలిపారు.
నీట్ పరీక్షకు
పటిష్ట బందోబస్తు
ఎస్పీ నారాయణరెడ్డి
అనంతగిరి: నీట్ పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి శనివారం తెలిపారు. ఆదివారం జరగనున్న పరీక్షకు భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 1,193 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు వివరించారు. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష జరిగే సమయంలో కేంద్రాల వద్ద గల జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
రేపటి నుంచి 13 వరకు తొమ్మిది బృందాల పర్యటన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల ఐదు నుంచి 13 వరకు తొమ్మిది బృందాలు, 54 గ్రామాల్లో పర్యటించి సహజ వనరులు, పంట మార్పిడి, చెట్ల పెంపకం, సాగునీటి యాజమాన్యం, విత్తనాలు, రసాయనాల కొనుగోలు చేసిన రసీదులను భద్రపరుచుకోవడం వల్లే చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నట్లు సహజ వనరుల విభాగం సంచాలకురాలు డాక్టర్ కేపీ వాణి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. జిల్లాలోని మొయినాబాద్, కొత్తూరు, చేవెళ్ల, శంషాబాద్, మహేశ్వరం మండలాల్లోని రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సర్వే షురూ..
కందుకూరు: ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం సేకరించి పరిహారం చెల్లించిన భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు శనివారం సర్వే పనులు ప్రారంభించారు. మండల పరిధిలోని మీరాఖాన్పేట, పంజుగూడ రెవెన్యూలో గతంలో సేకరించిన భూములను సర్వేచేసి వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేయనున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫ్యూచర్సిటీ పీఎస్ సీఐ కృష్ణంరాజుతో పాటు కందుకూరు సీఐ సీతారామ్, పహడీషరీప్ డీఐ జితేందర్రెడ్డి పర్యవేక్షణలో నలుగురు ఎస్ఐలు, 60 మంది పోలీసు కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫెన్సింగ్ విషయంలో రైతులకు ఇబ్బందులు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, అందుకు తాము సహకరిస్తామని సీఐ కృష్ణంరాజు ఈ సందర్భంగా తెలిపారు.
ప్రభుత్వ పథకాలతో పేదలకు మేలు
మహిళా కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి
మొయినాబాద్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పామెన జ్యోతి అన్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ మున్సిపల్ ఉపాధ్యక్షురాలిగా చిలుకూరు మాజీ సర్పంచ్ గునుగుర్తి స్వరూపకు నియామకపత్రం అందజేశారు. అనంతరం జ్యోతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.