
ఉద్యాన పంటలకు ఊతం
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సృజన, కలెక్టర్ ప్రతీక్జైన్ ● చీమల్దరి గ్రామంలో పర్యటన
మోమిన్పేట: ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటలు సాగు చేసుకోవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సృజన తెలిపారు. శనివారం కలెక్టర్ ప్రతీక్జైన్తో కలిసి మండలంలోని చీమల్దరి గ్రా మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపా ధి కూలీలతో మాట్లాడారు. ఉపాధి పను లు, వేతనంపై ఆరా తీశారు. ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన తోటలు మామిడి, జామ, మునగ, సీతాఫలం తదితర పంటలు సాగు చేసుకోవచ్చని వివరించారు. మూడు సంవత్సరాల పాటు తోటల పెంపకానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పొలాల్లో ఏటవాలుకు అడ్డంగా చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలని సూచించారు. నర్సరీల్లో అన్ని రకాల మొక్కలను పెంచి వర్షాకాలంలో నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని కంపోస్టు షెడ్డు, శ్మాశాన వాటిక, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ యాదగిరి, శంకర్, ఈసీ వికాస్, కార్యదర్శులు భరత్, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
రైతులను ప్రోత్సహించాలి
నవాబుపేట: ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన వన పంటలు సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమి షనర్ సృజన ఆదేశించారు. శనివారం మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పొలాల వద్ద చెక్ డ్యామ్ల నిర్మాణానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, పంచాయత్ రాజ్ ఈఈ ఉమేష్, డీఈ మాధవరెడ్డి, ఎంపీడీవో అనురాధ, ఏపీఓ లక్ష్మీదేవి, పంచాయతీ కార్యదర్శులు గీత, ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.