
సమ్మెను జయప్రదం చేయండి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్
తాండూరు: కార్మికుల హక్కుల సాధన కోసం నెల 20వ తేదీన చేపడుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. గురువారం కార్మిక సంఘాలు, టీజేఎస్ పార్టీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సోమశంకర్లతో కలిసి ఆయన కార్మిక దినోత్సవాన్ని(మే డే) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్.బీఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద కార్మిక జెండాను ఎగుర వేశారు. అనంతరం సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చేందుకు సిద్ధమవుతోందన్నారు. వేతన జీవులు శ్రమదోపిడీకి గురవుతోన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న సార్వత్రిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు రాములు, వనరేష్, బలరాం, నర్సింహులు, వెంకటప్ప, కిష్టప్ప, అంబరప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎన్సీడీ రిపోర్టు
సకాలంలో పంపాలి
డీఎంహెచ్ఓ వెంకటరవణ
అనంతగిరి: ఎన్సీడీ(అసంక్రమిత వ్యాధులు) రిపోర్టులను సకాలంలో పంపాలని జిల్లా వైద్యాధికారి వెంకటరవణ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం వికారాబాద్లోని వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో వైద్యులు, ఎంఎల్హెచ్పీలు, ఎన్సీడీలు, సూపర్వైజర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, డీఈఓలకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంక్రమిత వ్యాధుల నివారణ, సర్వే కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఎన్సీడీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలుపర్చడానికి శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలన్నారు. గృహ సందర్శన చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించి జాబితా పంపాలన్నారు. కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్ వాసే, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నిరోషా, ఏఓ డాక్టర్ ప్రవీణ్కుమార్, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, సిబ్బంది మహేశ్, రేణుకుమార్, జయరాం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కులగణన నిర్ణయంపై హర్షం
మర్పల్లి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య పోరాట పటిమతోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో కులగణన చేపడుతుందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రవికుమార్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లో ఆర్.కృష్ణయ్యకు ఆయన పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులగణన చేస్తామనడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆర్.కృష్ణయ్య దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు.
శ్రమశక్తి అవార్డు ప్రదానం
పహాడీషరీఫ్: జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ఽ అబ్దుల్ రవూఫ్ శ్రమ శక్తి అవార్డును అందుకున్నారు. మే డే సందర్భంగా ప్రభుత్వం తరఫున గురువారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ గిగ్ అండ్ ప్లాట్ఫార్మ్ ప్రొఫెషనల్ అధ్యక్షుడైన రవూఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

సమ్మెను జయప్రదం చేయండి

సమ్మెను జయప్రదం చేయండి