ఖరీఫ్‌ సాగుకు సై | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ సాగుకు సై

May 2 2025 4:13 AM | Updated on May 2 2025 4:13 AM

ఖరీఫ్

ఖరీఫ్‌ సాగుకు సై

● జిల్లాలో 5.63 లక్షల ఎకరాల్లో సాగు ప్రణాళిక సిద్ధం ● 42,064 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ● ఏర్పాట్లలో నిమగ్నమైన వ్యవసాయశాఖ

తాండూరు: సాగుబడిలో రైతులు నూతన ఒరవడిని ప్రదర్శిస్తున్నారు. సంప్రదాయ ధోరణికి స్వస్తి చెప్పి వాణిజ్య పంటలపై ఆసక్తి చూపుతున్నారు. అందుకు వానాకాలం సీజన్‌(ఖరీఫ్‌)ను అనువైనదిగా ఎంచుకుంటున్నారు. దశాబ్దాలుగా జిల్లాలో కంది, పెసర, మినుము పంటల సాగుకు మక్కువ చూపేవారు. అయితే మూడు నాలుగేళ్లుగా ఇతర పంటలపై మొగ్గు చూపుతున్నారు.దీంతో జిల్లావ్యాప్తంగా కంది పంట విస్తీర్ణం భారీగా పడిపోతూ వస్తోంది.

పత్తి సాగుకు ఆసక్తి

జిల్లాలో 20 మండలాల్లోని రైతులు ఖరీఫ్‌(2025) సాగుకు సిద్ధమవుతున్నారు. 5.63 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా పత్తి, కంది, వరి, పెసర, మొక్కజొన్న, మినుము తదితర పంటలు సాగవుతాయి. ఎక్కువగా పత్తి పంటను రైతులు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వానాకాలం జిల్లా వ్యాప్తంగా 2.58 లక్షల ఎకరాలలో ఈ పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు. 1.31 లక్షల ఎకరాల్లో వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. 1.14 లక్షల ఎకరాలలో కంది పంట మూడో స్థానానికి పరిమితమవుతోంది. ఈ పంటలకు 42,064 క్వింటాళ్ల విత్తనాలు, సుమారు 70 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. అందుకు సరిపడా మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

తగ్గిన సాగు విస్తీర్ణం

జిల్లాలో గతేడాది ఖరీఫ్‌ ప్రణాళికలో 5.97 లక్షల ఎకరాలలో పంటల సాగుకు అంచనా వేశారు. కానీ ఈసారి మాత్రం 5.63 లక్షల ఎకరాల సాగు ప్రణాళికను రూపొందించారు. దీంతో గతేడాది ఖరీఫ్‌తో పోల్చితే 34,180 ఎకరాల పంట తగ్గినట్లు కనిపిస్తోంది.

కందికి తగ్గుతున్న ఆదరణ

గతంలో ప్రధాన పంటలుగా పప్పు దినుసుల సాగు ఉండేది. కానీ ఏటా భారీగా పడిపోతూ వస్తోంది. ఐదేళ్ల క్రితం జిల్లాలో కంది పంట విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాల వరకు సాగయ్యేది. తాజాగా వ్యవసాయాధికారులు ప్రణాళికలో 1.14 లక్షల ఎకరాలకు పడిపోయింది. అదే బాటలో మినుము 5,736 ఎకరాలకు చేరింది. పెసర 14,838 ఎకరాల్లో సాగవుతుంది. తాండూరు కంది పప్పునకు అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక గుర్తింపు లభించింది. దీంతో ఈ పప్పునకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అయినా కర్షకులు మాత్రం కంది సాగుకు అంతగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

విత్తనాల ఎంపికలో జాగ్రత్త

జిల్లా వ్యాప్తంగా 5.63 లక్షల ఎకరాలలో ఖరీఫ్‌ పంటల సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి. స్థానికంగా ఏఓలు, ఏఈఓలు అందుబాటులో ఉన్నారు. నాణ్యమైన విత్తనాలతోనే పంట దిగుబడులు బాగుంటాయి. వేసవిలో లోతైన దుక్కులు దున్నుకోవాలి.

– మోహన్‌రెడ్డి, వ్యవసాయాధికారి,

వికారాబాద్‌ జిల్లా

ఖరీఫ్‌ సాగుకు సై 1
1/1

ఖరీఫ్‌ సాగుకు సై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement