
పారిశ్రామికవాడకు భూ సర్వే
● పలువురు రైతుల అంగీకారంతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం ● పులిచర్లకుంటతండాలో110 ఎకరాలకు హద్దుల నిర్ధారణ ● భారీ బందోబస్తు నడుమ కొనసాగిన సర్వే ● పర్యవేక్షించిన ఎస్పీ నారాయణరెడ్డి
దుద్యాల్: పటిష్ట బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు గురువారం పారిశ్రామికవాడకు సంబంధించిన భూ సర్వే చేపట్టారు. ఎస్పీ నారాయణరెడ్డి సర్వేను పర్యవేక్షించారు. ఇటీవల పులిచర్లకుంటతండాకు చెందిన పలువురు రైతులు కలెక్టర్ ప్రతీక్జైన్ను కలిసి పారిశ్రామికవాడ ఏర్పాటుకు రాతపూర్వకంగా అంగీకారం తెలిపారు. దీంతో ఉదయమే తహసీల్దార్ కిషన్ రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు సర్వే నిర్వహించారు. పులిచర్లకుంటతండా గ్రామానికి చెందిన దాదాపు 20 మంది రైతులకు సంబంధించి 110 ఎకరాల పట్టా భూములకు హద్దులు పాతినట్లు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్ వీరేశ్బాబు, ఆర్ఐ నవీన్కుమార్, సిబ్బంది లాలాప్ప, మారుతి, ఊషనప్ప, వీరేశ్, రైతులు యుగంధర్రెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదేబాటలో మిగిలిన వారు
మండల పరిధిలోని హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల్లో ప్రభుత్వం పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అవసరమైన భూ సేకరణకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల గ్రామాల్లో అసైన్డ్ భూములతో పాటు కొంతమంది పట్టా భూములను రైతుల అంగీకారంతో తీసుకుంది. ఇందుకు పరిహారం సైతం ముట్టజెప్పింది. కానీ రోటిబండతండా, పులిచర్లకుంటతండాలో మాత్రం గిరిజన రైతులు భూములు ఇవ్వడానికి సుముఖత చూపలేదు. దీంతో అధికారులు కొంతకాలం మౌనంగా ఉన్నారు. పులిచర్లకుంటతండాకు చెందిన ఓ రైతు గతంలోనే తన భూమిని పారిశ్రామికవాడకు ఇచ్చారు. దీంతో మరికొంత మంది ముందుకు వస్తున్నారు.
భారీ బందోబస్తు
సర్వే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ నారాయణరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. గతంలో జరిగిన ఘటనలు దృష్టి లో ఉంచుకొని ప్రత్యేక బలగాలను మోహరించారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐలు యాదగిరి, సత్యనారాయణ, రవూఫ్, రవిగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.