
నీటి సమస్య రానీయొద్దు
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● అధికారులతో సమీక్ష సమావేశం
అనంతగిరి: గ్రామాల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. గురువారం తాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పనులు, రాజీవ్ యువ వికాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, పింఛన్లు తదితర సమస్యలపై ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా స్థానిక వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బోర్లు, పైపు లైన్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకంగా ఉండాలన్నారు. అలాగే పలు అంశాలపై కల్టెకర్ మాట్లాడి సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరి, డీఆర్డిఓ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, హౌసింగ్ ఈఈ కృష్ణయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, డీబీసీడబ్ల్యూఓ ఉపేందర్, డీఎండబ్ల్యూఓ కమలాకర్ రెడ్డి, ఇన్చార్జి డీఎస్సీడీఓ సత్తార్, డీఎంహెచ్ఓ వెంకటరవణ, పంచాయతీ రాజ్ ఈఈలు ఉమేష్, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా నీట్ పరీక్షలు
నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో నీట్–2025 పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం జరిగే నీట్ పరీక్షకు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదు కేంద్రాల్లో 1,193 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థులు కేంద్రంలోకి అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో మాత్రమే తీసుకురావాలన్నారు. అభ్యర్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్కు సూచించారు. నీట్ పరీక్షకు సాయిలత, కుమారస్వామిలని కోఆర్డినేటర్లుగా నియమించారు. మరింత సమాచారం కోసం 08416 235291 ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, డీఈఓ రేణుకాదేవి, ఆర్డిఓ వాసుచంద్ర, సూపరింటెండెంట్ నైమత్ అలీ, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ భీమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.