తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు సోమవారం రాత్రి శ్రీరామచంద్ర పుష్కరిణిలో వేడుకగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలంకరణలతో సర్వాంగ సుందరంగా అలకరించిన తెప్పపై సీతారాములు కొలువై పుష్కరిణిలో ఐదు చుట్టు ప్రదక్షిణ చేసి, భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ఆలయంలో సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, నారికేళ జలాలతో అభిషేకం చేశారు. రాత్రి సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్రపుష్కరిణికి వేంచేపు చేశా రు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి వారి తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తెప్పపై పుష్కరిణిలో విహరిస్తున్న
సీతారామలక్ష్మణులు


