మండలంలోని ప్రకృతి వనరులను
అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు.
గుట్టలను, కొండలను సైతం వడియాలు, అప్పడాల్లా కరకరలాడిస్తున్నారు. పర్యావరణ విధ్యంసకులవుతున్నారు! దీనికి ‘సిద్ధేశ్వరగుట్ట’ నిలువెత్తు నిదర్శనంగా ఉంటోంది. తనను నిలువెల్లా ఛిద్రం చేశారని గుట్ట ఆక్రోశిస్తోంది.
రామచంద్రాపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మండలంలో అనుపల్లె, రాయలచెరువు, గణేష్ పురం, గుండోడు కణం, ప్రాంతాల్లో అడవులను కొల్లగొట్టేశారు. ప్రస్తుతం సి. రామాపురం లెక్క దాఖలాలో సర్వే నంబర్ 28లోని సిద్ధేశ్వర గుట్టనూ పిండి చేసి కోట్లు గడిస్తున్నారు.! సిద్ధేశ్వర గుట్టలో ఎన్నో ఏళ్లనాటి వృక్షాలను నేలమట్టం చేసి, హిటా,ఈ, జేసీబీలతో గుట్టలను తవ్వేస్తున్నారు. రోజూ వందలాది లారీల్లో అక్రమ గ్రావెల్ తరలిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ జేబులు నింపుకుంటున్నారు. వీరి దెబ్బకు అడవులు, గుట్టలు రూపురేఖలు మారిపోతున్నాయి. మరోవైపు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వీటిపై ఫిర్యాదులు అందుతున్నా ఒత్తిళ్లకు జడిసి అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. పైగా నేతల అరాచకాలకు సహకరిస్తూ తప్పుడు నివేదికలిస్తున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. ఉన్నతాధికారులైనా స్పందించి, సిద్ధేశ్వరగుట్ట పరిరక్షణ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
భారీ యంత్రాలతో ప్రకృతితో పాటు బండలను నాశనం చేసిన అక్రమార్కులు


