తిరుపతి అర్బన్: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు ప్రజలు పలు సమస్యలపై 358 వినతులు సమర్పించారు. ప్రజల వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, డీఆర్వో నరసింహులు స్పెషల్ డిప్యూటీ కల్లెక్టర్లు శివశంకర్ నాయక్, రోజ్మాండ్ తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.


