ఏర్పేడు:మండలంలోని గుడిమల్లంలో ఆనందవల్లి సమేత పరశురామేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం బాలాలయ పూజలు ప్రారంభించారు. ఏప్రిల్ 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఆలయంలో మహాకుంబాభిషేకం జరుపనున్న నేపథ్యంలో శనివారం ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి శక్తులను అత్తి చెక్కతో చేసిన ప్రతిమలోకి ఆవాహన చేసి బాలాలయంలోనికి ప్రవేశ పెట్టే పూజలు ప్రారంభమయ్యాయి.
నేడు బాలాలయ ప్రతిష్టాపన
ఆదివారం ఆలయ ప్రాంగణంలో బాలాలయ ప్రతిష్టాపన జరగనుంది. ఉదయం 6 గంటలకు వల్లభ గణపతి పూజ, సూర్య పూజ, మండలారాధన, విశేష హోమాలు నిర్వహించనున్నారు.
ఆలయ దర్శనాలు రద్దు
ఆదివారం నుంచి స్వామి, అమ్మవార్లను ప్రాణప్రతిష్ట చేసి బాలాలయంలో ప్రతిష్టించనున్న నేపథ్యంలో భక్తులకు ప్రధాన ఆలయ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ రామచంద్రారెడ్డి ప్రకటించారు.


