తిరుపతి లీగల్: మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కారమై ఇరు పార్టీలకు అంతా మంచిదే జరుగుతుందని ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ, తిరుపతి మండల న్యాయ సేవ అధికార సంస్థ సంయుక్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 43 మంది న్యాయవాదులకు తిరుపతి శ్వేత భవనంలో శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా జడ్జి అరుణ సారిక ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి అరుణ సారిక మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై అవగాహన పెంచుకుని కేసుల పరిష్కారంలో న్యాయవాదులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి జి.అర్చన, ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి, సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీ సభ్యులు అంజా సక్సేన, సుమన్ శర్మ పాల్గొన్నారు.


