తిరుపతి క్రైమ్ : సమాజంలో మహిళలకు రక్షణ కల్పించి, వారిలో అచంచలమైన విశ్వాసాన్ని నింపడం ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ప్రాథమిక బాధ్యత అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుపతి పోలీస్ మైదానంలో మహిళా సిబ్బందికి ప్రత్యేక మెడికల్ క్యాంప్, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని కొనియాడారు. కుటుంబ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూనే, వృత్తిపరంగా పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది చూపుతున్న ధైర్యం, క్రమశిక్షణ ఆదర్శనీయమని అభినందించారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో మహిళా పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తూ, సైబర్ నేరాలు, వేధింపులపై మహిళలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.
ప్రత్యేక వైద్య శిబిరం
మహిళా డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్లో మహిళా సిబ్బందికి రక్త పరీక్షలు, బీపీ, షుగర్ వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసులకు ఎస్పీ సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీమణి ఎల్.ఇందుహారిక, శ్రీకీర్తి, విమలాకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అదనపు ఎస్పీలు వెంకట్రావు (పరిపాలన), రవిమనోహర్ ఆచారి (శాంతి భద్రతలు), శ్రీనివాసులు (క్రైమ్స్), పోలీస్ డాక్టర్ మాధురి, సీఐడీ డీఎస్పీ హేమలత, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ తమిమ్ అహ్మద్ పాల్గొన్నారు.


