తిరుపతి తుడా: స్విమ్స్ యాజమాన్యంతో కార్మికుల చర్చలు విఫలం అయ్యాయి. స్విమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 8వ రోజుకు చేరుకున్నాయి. కార్మికుల వేతనాలు పెంచాలని, శానిటేషన్ హోదాను రద్దు చేయాలని, గతంలో అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు గత ఎనిమిది రోజులుగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం స్విమ్స్ యాజమాన్యం కార్మిక సంఘాల నాయకులను చర్చలకు పిలిచింది. ఈ చర్చల్లో స్విమ్స్ డైరెక్టర్, టీటీడీ విజిలెన్న్స్ డీఎస్పీ, విజిలెన్స్ అధికారులు, వెస్ట్ సీఐ సమక్షంలో కార్మికులు, సీఐటీయూ నాయకులతో చర్చలు జరిగాయి. అయితే కార్మికుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడంతో చర్చలు విఫలమైనట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. అధికారులు మళ్లీ సమయం కావాలని చెప్పి పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని సూచించడంతో నాయకులు కె వేణుగోపాల్, పి బుజ్జి, స్విమ్స్ యూనియన్ కార్యదర్శి జి రవి, అధ్యక్షుడు వి సూరి, మారిముత్తు, గోపి తదితర కార్మిక నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అధికారులకు సమ్మె కొనసాగింపు నోటిసును కార్మికులు అందజేశారు.


