ఎన్ఎస్యూలో ఇంటర్వ్యూలు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ ఫెలో–1, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ ప్రూఫ్ రీడర్– 4 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, ఇతర వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.
వైన్షాపు దగ్ధం
చంద్రగిరి : మండలంలోని తొండవాడ కూడలి వద్ద వీబీ వైన్షాపు ఆదివారం వేకువజామున దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో దుకాణంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాచ్మన్ వెంటనే షాపు యజమానికి సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే లోపే దుకాణంలోని మద్యం దాదాపు ఆహుతైంది. రెండు రోజుల క్రితమే సుమారు రూ.35లక్షల మద్యం తీసుకువచ్చి నిల్వ చేశామని షాపు యజమాని వెల్లడించారు. మద్యంతోపాటు సీసీ కెమెరాలు, ఫర్నిచర్, ఇతర సామగ్రి కాలిబూడిదైనట్లు తెలిపారు. ఈ మేరకు ఎకై ్సజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత బలవన్మరణం
సత్యవేడు: మండలంలోని బాలకృష్ణాపురం గిరిజన కాలనీకి చెందిన మారయ్య భార్య మంజుల శనివారం రాత్రి బలవన్మణం చెందింది. వివరాలు.. మారయ్య, మంజులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. మారయ్య మద్యానికి బానిసగా మారాడు. తాగుడు మాన్పించేందుకు భర్తతో అయ్యప్ప మాల వేయించింది. ఈ క్రమంలో శనివారం మాల తీసి వేసిన మారయ్య మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో ఇద్దరూ గొడవ పడ్డారు. రాత్రి 9గంటలకు భర్త ఇంటి బయటకు వెళ్లడంతో మంజుల గుళికుల మందును నీటిలో కలుపుకుని తాగేసింది. కుటుంబీకులు గుర్తించి సత్యవేడు పీహెచ్సీకి తీసుకెళ్లారు. మెరుగైన వైద్య కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందతూ ఆదివారం వేకువజామున మంజుల మరణించింది. హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎర్రచందనం పట్టివేత
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : పాదిరేడు గొల్లపల్లి పరిధి దిగువ నేరేడుచర్ల ప్రాంతంలో దాచిపెట్టిన 32 ఎరచ్రందనం దుంగలను ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సుదర్శనరెడ్డి తెలిపారు. తనిఖీల్లో తిరుపతి ఎఫ్ఆర్ఓ మునియా నాయక్, చెల్లూరు బేస్ క్యాంపు వాచర్లు పాల్గొన్నారని వెల్లడించారు.
పరశురామేశ్వరుని సేవలో నిశాంత్కుమార్
ఏర్పేడు : మండలంలోని గుడిమల్లంలో వెలసిన ఆనందవల్లీ సమేత శ్రీపరశురామేశ్వరుని ఆదివారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ కుటుంబ సమేతంగా సేవించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఈఓ రామచంద్రారెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితుల ఆశీర్వచనం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు.
వ్యక్తి ఆత్మహత్య
పెళ్లకూరు : మండలంలోని పాలచ్చూరు సమీపంలో కోనేటిరాజుపాళెం మార్గంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఈ మేరకు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నాగరాజు కథనం మేరకు.. చిత్తూరు జిల్లా, గుడిపాల మండలం, రామాపురం గ్రామానికి చెందిన పి.గుణశేఖర్(40) అనే వ్యక్తి మేనకూరు సెజ్లో హిటాచీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఏమైందో తెలియదు కాని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతదేహం కుళ్లిపోయింది. రెండు రోజుల క్రితం మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
గొలుసు అపహరణ
భాకరాపేట : ఎర్రావారిపాళెం మండలం ఉదయమాణిక్యం పంచాయతీ ఎగువరాజుపల్లెలో ఆదివారం ఓ మహిళ మెడలో గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు చిరునామా అడుగుతున్నట్లు నటించి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఎన్ఎస్యూలో ఇంటర్వ్యూలు
ఎన్ఎస్యూలో ఇంటర్వ్యూలు


