నకిలీ విత్తన గాథ
మనోవేదనతో కుమిలిపోతున్నాం
ప్రభుత్వం ఆదుకోవాలి
కలెక్టర్ వద్ద అన్నదాతల అవేదన
వినవయ్యా..
నకిలీ వరి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయాం.. మనోవేదనతో కుమిలిపోతున్నాం. దశాబద్దాలుగా వ్యవసాయమే వృత్తిగా జీవనం సాగిస్తున్నాం. ఏ ప్రభుత్వంలోనూ ఈ తరహాలో మోసం జరగలేదు. మేము ఎప్పుడూ ఇలా మోసపోలేదు. సాధారణంగా నాట్లు వేసిన 80 రోజుల తర్వాత పొట్ట, వెన్ను రావాల్సి ఉంది. అలా వస్తేనే దిగుబడి ఎకరాకు 30 బస్తాల (బస్తా 75 కేజీలు) నుంచి 40 బస్తాలు వస్తుంది. అయితే నకిలీ వరి విత్తనాలతో కేవలం నాట్లు వేసిన 20 రోజులకే పొట్ట, వెన్ను వచ్చేస్తుంది. ఇలా వస్తే ఎకరం 10 బస్తాలు దిగుబడి కూడా రాదు. దీంతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూళ్లూరుపేట రైతులు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ జరిగిన సందర్భంగా సూళ్లూరుపేటకు చెందిన రైతులు పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు సాగు చేయడంతో ముందస్తుగా వచ్చిన పరి కంకులను చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ వద్దకు వెళ్లారు. ‘సూళ్లూరుపేటలో రైతులు వరి పంటను ఎక్కువగా పండిస్తారు. ఈ క్రమంలో పూజిత అగ్రో సర్వీసెస్ సెంటర్లో ఈ ఏడాది సెప్టెంబర్లో బీపీటీ–2782 నంబర్ వరి విత్తనాలు దిగుబడి ఎక్కువగా వస్తుందని ఆ డీలర్ నమ్మబలికారు. దాంతో ఆ డీలర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేశాం. బిల్లులు కూడా ఉన్నాయి. 25 రోజుల నారు నాటితే పంట బాగా వస్తుందని చెప్పారు. దాంతో అలానే నాటాం. అయితే నాట్లు వేసిన 70 నుంచి 80 రోజులకు పొట్ట, వెన్ను రావాల్సి ఉండగా 20 రోజులకే వచ్చేస్తుంది. డీలర్ను గట్టిగా ప్రశ్నిస్తే తమకు నంద్యాల నుంచి అ్నపూర్ణ కంపెనీ ద్వారా విత్తనాలు వచ్చాయి..వాటిని మాత్రమే రైతులకు విక్రయించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో రైతులు సాగు చేసిన నకిలీ విత్తనాల పంటను దున్నలేక..పంటను వదిలిపెట్టలేక..మళ్లీ కొత్తగా నాట్లు వేయాలంటే అదును లేక.. మళ్లీ పెట్టుబడి లేక..ప్రతి రోజు పొలం వద్దకు వెళ్లి పంట వద్ద కన్నీరు పెట్టుకుంటున్నాం.. ఆ నకిలీ విత్తనాలు విక్రయించిన డీలర్పై చర్యలు తీసుకోవాలి.. రైతులకు న్యాయం చేయాలి.’ అని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
నకిలీలతో నష్టపోయాం
నకిలీ విత్తన గాథ


