వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు పెద్దపీట
తిరుమల: వైకుంఠ ద్వార దర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఉదయం టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువర్ ఈఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై ఈఓ భక్తులకు వివరించారు.
● డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.
● వైకుంఠ ద్వార దర్శనాలకు కేటాయించిన 182 గంటల దర్శన సమయంలో 164.15 గంటల సమయం సామాన్య భక్తులకే కేటాయింపు.
● పది రోజుల్లో 7.70 లక్షల మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు.
● డిసెంబర్ 30, 31, జనవరి ఒకటో తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ.
● నవంబర్ 27 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు దాదాపు 25 లక్షల మంది భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు.
● డిసెంబర్ 2వ తేదీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 1.70 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు కేటాయింపు.
● మొదటి మూడు రోజులు ఎస్ఈడీ, శ్రీవాణి దర్శనాలు రద్దు. మిగిలిన 7 రోజులకుగాను 5వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శనం వెయ్యి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు 15 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తాం.
● జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠం– 2 ద్వారా భక్తులకు సర్వదర్శనం.
● పది రోజులపాటు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరు. ప్రత్యేక దర్శనాలు రద్దు.
● స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం.
● దాతలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో బుకింగ్కు అవకాశం.
● జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికుల దర్శనానికి డిసెంబర్ 10వ తేదీన ఆన్లైన్లో బుకింగ్కు అవకాశం. ఈ కార్యక్రమంలో టీటీడీ టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీ కృష్ణ, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు.


