వైద్యం కోసం వస్తే.. జాబ్ ఇప్పిస్తానని నమ్మించి..
తిరుపతి క్రైమ్: ఓ వైద్యుడి మోసాలపై బాధితులు ఆధారాలతో సహా ఆదివారం ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగు చూసింది. తిరుపతికి చెందిన బాధితురాలు కోమల తెలిపిన వివరాల మేరకు.. సంకల్ప ఆస్పత్రిలో వైద్యం కోసం బంధువులను తీసుకురాగా అక్కడే విధుల్లో ఉన్న వైద్యుడు రమేష్ యాదవ్ మాటల్లో పెట్టి మీ అబ్బాయికి సింగపూర్లో నెలకు రూ.లక్షకు పైగా జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తానని ఇందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని నమ్మించాడు. కొడుకు భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని బాధితురాలు కూడబెట్టిన డబ్బును రెండు దఫాలుగా డాక్టర్ రమేష్ యాదవ్కు రూ.5 లక్షలు చెల్లించింది. ఆస్పత్రి పేరు చెప్పి బాధితురాలిని బాగా నమ్మించాడు. అలానే మరో నలుగురు నుంచి ఇదేవిధంగా నమ్మబలికి లక్షల్లో డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు తెలుస్తోంది. నెలల తరబడి అదిగో ఇదిగో అంటూ ఆశ చూపిన రమేష్ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని బాధితురాలు చెప్పుకొచ్చారు. ఆస్పత్రికి వచ్చి విచారించగా చాలా రోజుల క్రితమే అతను తమ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడని, ప్రస్తుతం చైన్నెలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా చేరినట్లు తెలుస్తోందని సంకల్ప ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో బాధితురాలు అవాకై ్కంది. సంకల్ప ఆస్పత్రి పేరు చెప్పి, ఇక్కడ వైద్యుడిగా ఉండడంతోనే రమేష్ యాదవ్ను నమ్మామని బాధితురాలు లబోదివోమన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని మోసానికి పాల్పడిన డాక్టర్ రమేష్ యాదవ్ నుంచి డబ్బులు ఇప్పించాలని ఆమె కంటతడి పెట్టుకున్నారు.


