మంత్రి అనుచరుడి భూ దందా!
తిరుపతిలోని ఓ విద్యాసంస్థల్లో కీలక అధికారిగా ఉన్న కబ్జాదారుడు
అక్రమంగా విశ్రాంత మహిళా
వైద్యాధికారిణి ప్లాట్ ఆక్రమణ
రాజకీయ అండ, మంత్రికి అనుచరుడి కావడంతో దౌర్జన్యం
బాధిత మహిళా వైద్యాధికారిణిపై వేధింపులు
రాత్రికి రాత్రి అక్రమంగా సాగిస్తున్న నిర్మాణాలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసు, రెవెన్యూ అధికారులు
న్యాయం చేయాలంటూ బాధితురాలు వేడుకోలు
సాక్షి టాస్క్ఫోర్స్ : చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ భూములకే కాకుండా, ప్రైవేటు భూములకు రక్షణ కరువైంది. కష్టపడి సంపాదించుకున్న ప్లాట్లను అధికార పార్టీ అండతో యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. ఎవరూ లేని ఓ విశ్రాంత వైద్యాధికారిణికి చెందిన ప్లాట్పై కన్నేసిన ఓ మంత్రి అనుచరుడు దౌర్జన్యంగా అక్రమ నిర్మాణాలకు పూనుకుంటున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. తన తండ్రి నుంచి వచ్చిన భూమిని ఆ మంత్రి అనుచరుడు కబ్జాకు పాల్పడుతున్నాడంటూ బాధిత విశ్రాంత వైద్యాధికారిణి పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. దీంతో చేసేదేమి లేక బాధితురాలు మీడియాను ఆశ్రయించారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలో సర్వే నంబరు 556లో గెజిటెడ్ ఆఫీసర్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెట్ ఆధ్వర్యంలో వెంచర్ వేశారు. అదే వెంచర్లో ప్లాటు నంబరు 60కు సంబంధించి సుమారు 100 అంకనాలకు పైగా డాక్టర్ సుందరయ్య 1976వ సంవత్సరంలో ప్లాటను కొనుగోలు చేశాడు. అనంతరం ఆయన తన కుమార్తె డాక్టర్ మైథిలికి 2012లో సదరు ప్లాట్ను గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాడు.
అధికారం అండతో ఆక్రమణ
సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు, ఓ మంత్రికి చెందిన విద్యా సంస్థల్లో జోనల్ అధికారిగా ఉన్న వ్యక్తికి విశ్రాంత వైద్యాధికారిణి డాక్టర్ మైథిలి పక్కనే కొన్నాళ్ల క్రితం ప్లాటును కొనుగోలు చేశాడు. మైథిలికి వయస్సు రీత్యా వృద్ధాప్యంలో ఉండడం, ఆ వ్యక్తికి అధికారం తోడవ్వడంతో మైథిలీ ప్లాటుపై కన్నేసినట్లు బాధితురాలు ఆరోపించారు. ఈ క్రమంలోనే కొంత కాలంగా ఆమె ప్లాటును ఆక్రమించుకునేందుకు అనేక రకాలుగా ఆమెను ఇబ్బందులకు గురిచేసినట్లుగా బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. కోట్ల విలువైన తన ప్లాటును మంత్రి అండతో ఆక్రమించుకోవడానికి యత్నిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే అధికారులు సైతం విద్యాసంస్థల జోనల్ అధికారికి వత్తాసు పలుకుతూ తనకు తీవ్ర అన్యాయం చేశారంటూ వాపోయారు.
రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలు
సర్వే నంబరు 556లోని ప్లాటు నంబరు 60లో గల మైథిలీ ప్లాటులో సుమారు 40 అంకనాలకు పైగా మంత్రి అనుచరుడు బుధవారం రాత్రి అక్రమ నిర్మాణాలకు పూనుకున్నాడు. బుధవారం సాయంత్రం దౌర్జన్యంగా ప్లాట్లులోకి రావడంతో పాటు జేసీబీతో పనులను ప్రారంభించాడు. సుమారు 40 అంకనాలకు పైగా స్థలాన్ని ఆక్రమించి, ప్రహరీ నిర్మాణానికి పూనుకున్నట్లు బాధితురాలు వాపోయారు. తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు.
ఆటో డ్రైవర్ నిజాయితీ
మంత్రి నుంచి సహకారం ?
మంత్రికి చెందిన విద్యాసంస్థల్లో కీలక అధికారి ఉన్న కబ్జాదారుడి ఆగడాల నుంచి తనను కాపాడాలంటూ రాష్ట్ర అధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే రాష్ట్ర స్థాయి అధికారులు సైతం ఆయనకు మంత్రిగారి మద్దతు ఉందని, తామేమి చేయలేయమని చేతులెత్తేసినట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెవెన్యూలోని కొంత మంది అధికారులు, పోలీసులు సిండికేట్గా మారి తన బీసీ మహిళా అని కూడా చూడకుండా ప్లాటును ఆక్రమించుకుని, అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారంటూ విశ్రాంత వైద్యాధికారిని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 30 ఏళ్ల పాటు పేదలకు వైద్య సేవలను అందించానని, అలాంటిది ఈ ప్రభుత్వంలో అధికారులను అడ్డంపెట్టుకుని ఆక్రమణలకు పాల్పడటం దారుణమంటూ ఆమె మీడియాతో వాపోయారు. జిల్లా స్థాయి అఽధికారులు తనకు న్యాయం చేయాలంటూ పత్రికాముఖంగా వేడుకున్నారు.
మంత్రి అనుచరుడి భూ దందా!


