
అన్నదాతలకు అండగా..
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్సీపీ పోరుబాట మామిడి బకాయిలు వెంటనే విడుదల కోసం ఈనెల 9న అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసనలు తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ నేతల సమావేశం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : అన్నదాతలకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాటకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9న తిరుపతి, చిత్తూరు జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఆ మేరకు బుధవారం తిరుపతిలోని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, ఆర్కే రోజా, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు బియ్యపు మధుసూదన్రెడ్డి, భూమన అభినయరెడ్డి, డాక్టర్ సునీల్కుమార్, వెంకటేగౌడ్, నూకతోటి రాజేష్, కృపాలక్ష్మి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రవర్మ, తిరుపతి నగర పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి సమావేశమయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మామిడి దిగుబడులకు గుజ్జు పరిశ్రమల వారు కిలో మామిడికి రూ.8, ప్రభుత్వం రూ.4 చెల్లించాల్సి ఉంది. మామిడి దిగుబడులు విక్రయించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించకపోవటాన్ని తీవ్రంగా పరిగణించారు.
ఇంకా రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవటం, యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలపై చర్చించారు. రైతు సమస్యల పరిష్కారం ఈనెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ నేతలు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. పలమనేరులో రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్, శ్రీకాళహస్తిలో తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, జీడీ నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, చిత్తూరులో మాజీ మంత్రి నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్, కుప్పంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, తిరుపతిలో నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.