
తిరుచ్చిపై సిరులతల్లి విహారం
చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వారపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు చేశారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తదుపరి శ్రీకృష్ణ ముఖమండపం వద్ద స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అలంకార మండపంలో విద్యుత్కాంతుల నడుమ ఊంజల్ సేవ చేశారు. సర్వాలంకార భూషితురాలైన పద్మావతి అమ్మవారు బంగారు తిరుచ్చి వాహనంపై కొలువుదీరి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్కు రూ.17 లక్షల విరాళం
తిరుమల : శ్రీవారి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు హైదరాబాద్ కు చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ సత్య రోహిత్ రూ.17 లక్షల విరాళం శుక్రవారం అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీ డీ అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరికి డీ డీని అందజేశారు. ఈ నగదును మాతృశ్రీ తరి గొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భక్తులకు ఒక పూట మధ్యాహ్నం భోజనం వ డ్డించేందుకు వినియోగించాలని దాత కోరారు.
28న ఎస్వీయూ క్యాంటీన్కు టెండర్ నోటిఫికేషన్
తిరుపతి సిటీ : ఎస్వీయూ క్యాంటీన్కు ఈనెల 28వ తేదీన టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని క్యాంటిన్ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం ఈ మేరకు వీసీ ఆధ్వర్యంలో సమావేశమైన క్యాంటిన్ కమిటీ గతంలో ఇచ్చిన టెండర్ను రద్దు చేసింది. ప్రస్తుతం క్యాంటీన్ను నిర్వహిస్తున్న జయచంద్రనాయుడు అత్యల్పంగా టెండర్ కోట్ చేయడంతో ఆయనను వచ్చే టెండర్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా అనర్హుడిగా ప్రకటించింది. క్యాంటిన్ నిర్వహణపై ఆసక్తిగలవారు 28 నుంచి 15 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
31 నుంచి పోస్టల్ ఖాతాలకు ప్రత్యేక శిబిరాలు
తిరుపతి సిటీ : పోస్టాఫీసులో సేవింగ్ ఖాతాలు తెరుచుకునేందుకు ఈ నెల 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ బి.నరసప్ప తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ శిబిరాల్లో పోస్ట్ సేవింగ్ ఖాతాలను తెరవడం, ఇప్పటికే ఉన్న ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో నిరుపయోగంగా ఉన్న 11,599 ఖాతాలను 465 పోస్టాఫీసుల ద్వారా పునరుద్ధరణ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను అర్హులైన లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుగా ఈ ఖాతాలు ఉపయోగపడతాయని చెప్పారు. సాధారణ రోజులలో సైతం పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతాలు తెరుచుకోవచ్చని తెలిపారు. 18ఏళ్లు నిండిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎస్వీయూలో
ఫారెస్ట్ అధికారుల తనిఖీ
తిరుపతి సిటీ: ఎస్వీయూలో రోడ్డు పక్కన ఉన్న శ్రీగంధం వృక్షం ఇటీవల అపహరణకు గురికావడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఈ విషయాన్ని సుమోటాగా తీసుకుని శుక్రవారం వర్సిటీలోని శ్రీవారి ఆలయం ఎదుట దుండగులు నరికివేసి అపహరించిన శ్రీగంధం మొదలును పరిశీలించారు. అలాగే వర్సిటీలో శ్రీగంధం, ఎర్రచందనం చెట్ల వివరాలను సేకరించారు. అపహరణకు గురైన మొక్కల వివరాల నివేధికను సంబంధిత ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ తనిఖీలో వర్సిటీలో సుమారు పది రకాల చెట్లు మాయమైనట్టు వర్సిటీలో చర్చ సాగుతోంది.

తిరుచ్చిపై సిరులతల్లి విహారం

తిరుచ్చిపై సిరులతల్లి విహారం