
● అబ్రకం ఖనిజానికి పెరిగిన డిమాండ్ ● దేశవిదేశాల్లో మంచ
సైదాపురం : జిల్లాలోని గనుల్లో లభించే మైకా (అబ్రకం) ఖనిజానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రపంచంలోనే మరెక్కడ దొరకని నాణ్యమైన మైకా ఇక్కడే దొరుకుతోంది. విద్యుత్, అణు పరీక్షలకు మైకాను ప్రధానంగా ఉపయోగిస్తుంటారు. రూ.కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే అబ్రకం గనులకు దేశంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లా పెట్టింది పేరు. ఇప్పుడు మైకాకు విపరీతమైన గిరాకీ రావడంతో స్థానికంగా ఉన్న అబ్రకం పరిశ్రమకు మంచిరోజులు వచ్చినట్టే అని గనుల యజమానులు వెల్లడిస్తున్నారు.
నిల్వలు కనిపెట్టడమే కష్టం
ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతోందో.. ఏ ప్రాంతంలో ఏయే ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో.. ఎంత మేరకు నిల్వలు అందుబాటులో ఉన్నాయో.. క్షణాల్లో కనిపెట్టే ఉపగ్రహాలు సైతం మైకా జాడ తెలుసుకోలేక పోతున్నాయి. భూగర్భంలో ఎక్కడ మైకా నిక్షేపాలు ఉన్నాయో కనిపెట్టడమే కష్టతరం. కొన్ని చోట్ల వంద అడుగుల్లోనే అబ్రకం దొరికితే.. మరికొన్ని చోట్ల వెయ్యి అడుగుల వరకు తవ్వకాలు జరిపినా ప్రయోజనం ఉండని పరిస్థితి.
100 అడుగులు దాటితేనే..
అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసే వారు తప్పని సరిగా 100 అడుగుల మేర త్వవకాలను సాగించాల్సి ఉంటుంది. ఆపైనే మైకా లభ్యమవుతుంది. అది కూడా అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. ఓ గని యాజమాని అండర్ గ్రౌండ్ మైనింగ్లో మైకా వెలికితీసేందుకు రూ.2కోట్లు వెచ్చించినా ఫలితం దక్కలేదు. అదృష్టం కలిసి వస్తే వంద అడుగుల్లోనే మైకా దొరుకుంది. లేదంటే వెయ్యి అడుగు తవ్వినా ప్రయోజనం ఉండదు.
మైకా వెలికి తీస్తున్న కార్మికులు
అందుబాటులో లేని టెక్నాలజీ
ఈ ప్రాంతంలో మైకా నిక్షేపాలు ఉన్నట్లు 1885లో కనిపెట్టారు. ఇక అప్పుడు గనుల నుంచి మైకాను ఎలా వెలికితీశారో ఇప్పుడు కూడా అలాగే తవ్వకాలు సాగిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మైకా పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. ఇక్కడ మాత్రం నేటికీ ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. కూలీలతోనే మైకాను భూగర్భం నుంచి వెలికితీయాల్సి రావడంతో పెట్టుబడి వ్యయం అనూహ్యంగా అధికమవుతోంది. పెరిగిన ఖర్చులు, కూలీల లభ్యత కారణంగా గనుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో దశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగిన అబ్రకం పరిశ్రమ నేలచూపులు చూసే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం మైకా డిమాండ్ పెరుగుతుండడంతో పలువురు యువ పారిశ్రామికవేత్తలు గనుల నిర్వహణపై ఆసక్తి చూపుతున్నారు. కునారిల్లుతున్న మైకా పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తున్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వస్తున్నారు.
నాడు 147...నేడు 10..!
గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లావ్యాప్తంగా సుమారు 147 మైకాను వెలికితీసే గనులు ఉండేవి. ప్రభుత్వం మైకా పరిశ్రమపై చిన్న చూపు చూస్తుండటంతో రోజురోజుకు భూగర్భ గనులకు కాలం చెల్లింది.అప్పట్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల మంది కార్మికులు జీవనోపాధి పొందేవారు. క్రమేణా పెట్టుబడి వ్యయం పెరిగిపోవడంతో అండర్ గ్రౌండ్ మైనింగ్ దాదాపు తగ్గి పోయింది. గత మూడేళ్లలోనే గనుల సంఖ్య 27నుంచి 10కి పడిపోయింది. గనులు మూతపడుతుండడంతో కార్మికుల సంఖ్య కూడా నేడు 2వేలకు తగ్గిపోయింది. సుమారు 48 వేల మంది మైకా గని కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. అండర్గ్రౌండ్ మైనింగ్ భారం కావడంతో పలువురు ఓపెన్ క్వారీలుగా గనులను మార్చ తవ్వకాలు కొనసాగిస్తున్నారు.

● అబ్రకం ఖనిజానికి పెరిగిన డిమాండ్ ● దేశవిదేశాల్లో మంచ