బతికి ఉంటే ఇబ్బంది పెడతాడని.. భర్తను చంపేసింది | Young Man Ends Life In Hyderabad | Sakshi
Sakshi News home page

బతికి ఉంటే ఇబ్బంది పెడతాడని.. భర్తను చంపేసింది

May 21 2026 8:05 AM | Updated on May 21 2026 8:20 AM

Young Man Ends Life In Hyderabad

హైదరాబాద్: కుటుంబ కలహాలతో వేరుగా ఉంటున్న భార్య ఇంటికి పిల్లలను చూడటానికి వచ్చిన భర్తను  తమ్ముడు,  అతని స్నేహితుడితో కలిసి భార్య విచక్షణారహితంగా దాడిచేసి హత్యచేశారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. వికారాబాద్‌ జిల్లా హజీపూర్‌ గ్రామానికి చెందిన గురు వెంకటేశ్‌ (31) బీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటూ హోటల్‌లో పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య, పిల్లలు వేరుగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి  11 గంటల సమయంలో వెంకటేశ్‌.. పిల్లలను చూసేందుకు రైతు బజార్‌ సమీపంలోని డబుల్‌బెడ్‌రూం నివాసాల్లో భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు.

భర్తను చూసిన స్వప్న ఇక్కడికెందుకు వస్తున్నావు అంటూ  తమ్ముడు పాండుతో కలిసి మూడో అంతస్తు నుండి  కిందకు తీసుకువస్తూ దాడి చేశారు. అంతటితో ఆగకుండా పాండు తన స్నేహితుడు జగదీష్‌ను పిలిపించుకుని ముగ్గురూ కలిసి  మూకుమ్మడిగా దాడిచేశారు. స్పృహ తప్పి పడిపోవడంతో..బతికి ఉంటే  మళ్లీ ఇబ్బంది పెడతాడని దాడి చేసి తీవ్రంగా కొట్టి  గ్రౌండ్‌ఫ్లోర్‌ వద్ద  వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు గమనించారు. మృతుడి సోదరుడు గురు తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతుని భార్య స్వప్న, ఆమె తమ్ముడు పాండు, అతని స్నేహితుడు జగదీష్‌లపై  కేసు నమోదు చేశారు.   

పోలీసుల అదుపులో నిందితులు
నిందితులు ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది.  హత్యకు గల కారణాలను రాబట్టేందుకు  విచారిస్తున్నట్లు తెలిసింది.   

Advertisement
 
Advertisement
Advertisement