ఆర్టీసీలో సీట్లు లేవు.. ప్రైవేటులో వెళ్లండి  | TS: Authorized Ticket Booking Agents Fraud In TSRTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో సీట్లు లేవు.. ప్రైవేటులో వెళ్లండి 

Oct 20 2021 2:45 AM | Updated on Oct 20 2021 8:57 AM

TS: Authorized Ticket Booking Agents Fraud In TSRTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్టేజీ క్యారియర్లుగా తిరుగుతూ ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండికొడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు తుదకు ఆర్టీసీ టికెట్లను కూడా టార్గెట్‌ చేశారు. ప్రయాణికులు వచ్చి ఆర్టీసీ టికెట్లు బుక్‌ చేసుకునే వేళ, వారు ప్రైవేటు బస్సులే ఎక్కేలా కొత్త ఎత్తుగడ వేశారు. దీన్ని గుర్తిం చటంలో ఆర్టీసీ విఫలమై భారీగా టికెట్‌ ఆదా యాన్ని కోల్పోతోంది.

ఫలితంగా ప్రైవేటు బస్సుల్లో నిండుగా ప్రయాణికులు ఉంటుండగా, ఆర్టీసీ బస్సులు మాత్రం కొంతమేర ఖాళీ సీట్లతో ప్రయాణించాల్సి వస్తోంది. ఆథరైజ్డ్‌ టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్లకు అధిక కమీషన్‌ ఆశ చూపి ప్రైవేటు ట్రావెల్స్‌ ఆపరేటర్లు అడ్డగోలు వ్యవహారానికి తెర దీశారు. తాజా దసరా ప్రయాణాల్లో ఈ రూపంలో ఆర్టీసీ భారీగా నష్టపోయింది.  

ఇదీ సంగతి.. 
ఆర్టీసీకి టికెట్ల ద్వారా ఎక్కువ ఆదాయం దూర ప్రాంత సర్వీసులతోనే సమకూరుతుంది. ఇందు కోసం సీట్లను ముందస్తు రిజర్వేషన్‌ ద్వారా భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రయాణికులు సొం తంగా ఆన్‌లైన్‌ సీట్లను రిజర్వ్‌ చేసుకునేలా వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ ఇస్తోంది. కానీ ఈ రూపంలో పూర్తిగా సీట్లు బుక్‌ కావు. ఇందుకోసం అబీ బస్, రెడ్‌ బస్‌ లాంటి వాటితో ఒప్పందం చేసుకుని వాటి ద్వారా సీట్లు బుక్‌ అయ్యేలా చేస్తుంది.

దీంతో పాటు కొం దరు రిజర్వేషన్‌ ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఏజెంట్లను ఆథరైజ్డ్‌ టికెట్‌ బుకింగ్‌ ఏజెం ట్లుగా పిలుచుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 ఏజెన్సీలు ఆర్టీసీకి అధికారిక టికెట్‌ బుకింగ్‌ సంస్థలుగా ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఈ ఏజెన్సీలు ఆర్టీసీ బస్సుల్లో సీట్లను మాత్రమే రిజర్వ్‌ చేయాలి. ఇందుకు ప్రతి టికెట్‌పై దాదాపు 8% వరకు కమీషన్‌ను ఆ ఏజెన్సీలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. వీటి ద్వారా దాదాపు 30% వరకు సీట్లు రిజర్వ్‌ అయ్యేవి. దీన్ని గుర్తించిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రధాన ఏజెంట్లతో అవగాహన కుదుర్చుకుంటున్నాయి.

ఆ ప్రయాణికులకు తమ బస్సుల్లో సీట్లు బుక్‌ చేస్తే ప్రతి టికెట్‌పై 20% కమీషన్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లేవని అబద్ధం చెప్పి వాటి బదులు ప్రైవేటు బస్సుల్లో ఉన్నాయంటూ ఆ టికెట్లను అంటగడుతున్నారు. దసరా రద్దీ ఎక్కువగా ఉన్నా, దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో సీట్లు మిగిలే కనిపించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement