సాక్షి, హైదరాబాద్: మియాపూర్ మార్తాండనగర్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ ఉన్న టాటాఏస్ వాహనం, రెండు బైకులు దగ్ధమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి, మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
2 రోజుల క్రితమే మణికొండలో..
వేసవికాలం కావడంతో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. హైదరాబాద్లోని మణికొండలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అక్కడివారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంతో ప్రమాదం తప్పింది. నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్లు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.


