
మూడేళ్ల బాలుడు మృతి
కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు
గోదావరిఖని(రామగుండం): రెండోకాన్పు కోసం తల్లిగారింటికి వచ్చింది.. పండంటి పాపకు జన్మనిచ్చింది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఆమె మొదటి సంతానం మూడేళ్ల బాలున్ని కారు రూపంలో మృత్యువు బలితీసుకుంది. గోదావరిఖని వన్టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం..
స్థానిక గంగానగర్లో శివరాజ్కుమార్(3) ఆదివారం కారు ఢీకొని మృతిచెందాడు. ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన పులిపాక రమేశ్ కొండగట్టు జేఎన్టీయూలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి గంగానగర్కు చెందిన సంధ్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల శివరాజ్కుమార్ ఉండగా, సంధ్య రెండో కాన్పుకోసం తల్లిగారింటికి గంగానగర్ వచ్చింది. పాప జన్మించి మూడు నెలలు అయ్యింది.
ఆదివారం కుటుంబ సభ్యులతో శివరాజ్కుమార్ ఆడుకుంటూ అనుకోకుండా ఒక్కసారిగా రోడ్ పైకి రాగా, మంచిర్యాల్ నుంచి గంగానగర్కు వెళ్తున్న కార్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో శివరాజ్కుమార్ మెడపై భాగంలో గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పటివరకు అందరితో ఆడుకుంటూ క్షణాల్లో మాయమైన కుమారున్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.