సకల సౌకర్యాలతో సచివాలయం
అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
డిజైన్లకు మార్పులు సూచించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ భవనంలో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలూ ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు అన్ని సౌకర్యాలతో ఉండాలని స్పష్టంచేశారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, సమావేశాల కోసం మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి ఉండేలా చూడాలని సూచించారు.
కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై సీఎం బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. కొత్త భవనానికి సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. గత సమీక్షలో సీఎం సూచనల మేరకు మార్పులు చేసిన డిజైన్లను ఆర్కిటెక్ట్ నిపుణులు ఈ సమావేశంలో ఆయన ముందు ఉంచగా.. వీటిలో మళ్లీ పలు మార్పులను సీఎం సూచించారు. తదుపరి సమీక్షలో సవరించిన డిజైన్లను పరిశీలించి తుది డిజైన్ ఖరారు చేసే అవకాశం ఉంది.