మెడికల్‌ రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు  | Telangana Medical Council Increased Fees For Medical Registrations | Sakshi
Sakshi News home page

మెడికల్‌ రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు 

Jul 23 2022 1:13 AM | Updated on Jul 23 2022 7:43 AM

Telangana Medical Council Increased Fees For Medical Registrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మెడికల్‌ రిజిస్ట్రేషన్ల ఫీజులను మెడికల్‌ కౌన్సిల్‌ భారీగా పెంచింది. వైద్య విద్య పూర్తి చేసినవారు కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాకే డాక్టర్‌గా పనిచేసేందుకు అర్హులు. అలాంటి వివిధ రకాల రిజిస్ట్రేషన్ల ఫీజులను సవరించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే సవరించిన ఫీజులు అమలులోకి వస్తాయని కౌన్సిల్‌ వెల్లడించింది. అయితే 65 ఏళ్లు దాటినవారు రెన్యువల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఒకవేళ తమ మెడికల్‌ పట్టా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనుకుంటే ఏడాది కాలానికి రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజుకు జీఎస్టీ వసూలు విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. ఒకవేళ ఉండేట్లయితే 18 శాతం జీఎస్టీని అభ్యర్థులు చెల్లించాలి. కాగా, ప్రొవిజనల్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు ఇప్పటివరకు రూ. వెయ్యి ఉండగా, దాన్ని రెట్టింపు చేస్తూ రూ. 2 వేలకు పెంచింది.

అలాగే ఇతర దేశాల్లో చదివి వచ్చిన వారికి ప్రొవిజనల్‌ ఫీజును రూ. వెయ్యి నుంచి ఏకంగా రూ.5 వేలకు పెంచింది. డూప్లికేట్‌ ప్రొవిజనల్‌ రిజిస్ట్రేషన్‌ను రూ. వెయ్యి నుంచి రూ. రెండు వేలకు పెంచారు. ఇక ఫైనల్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజును రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచారు. ఇతర దేశాల్లో చదివి వచ్చిన వారి ఫైనల్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజును రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు.

డూప్లికేట్‌ ఫైనల్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజును రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. కాగా, ఫీజుల పెంపును హెల్త్‌ కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె.మహేశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గుండగాని శ్రీని­వాస్, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ టి.కిరణ్‌కుమా­ర్, బాలరాజు నాయుడు, సన్నీ దావిస్, మహ్మద్‌ జహంగీర్‌ ఒక ప్రకటనలో ఖండించారు. పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని వారు కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement