
హైదరాబాద్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈనెల 1వ తేదీ నుంచి ఇవ్వాల్సిన సన్నబియ్యం పంపిణీకి బ్రేక్ పడింది. రేషనింగ్ ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధిలోని 81 రేషన్షాపుల పరిధిలో రూ.2,95,779 మంది కార్డుదారులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఉగాది కానుకగా వీరందరికీ ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే కోడ్ నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీ చేపట్టవద్దని ఉత్తర్వులు వెలువడ్డాయి.
దీంతో సర్కిల్–7 పరిధిలో ఏప్రిల్ నెల కోటా కింద దొడ్డి బియ్యాన్ని పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. సన్న బియ్యం బస్తాలు ఒక మూలన పెట్టాలని కూడా ఆదేశించారు. అన్ని రేషన్ షాపులు దొడ్డి బియ్యం పంపిణీ చేయనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏప్రిల్ 29 వరకు అమలులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెల కోటా కింద సన్న బియ్యం ఇవ్వడం లేదని, మే నెల నుంచి పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.