గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్రెడ్డితో జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత పంపిణీకి శ్రీకారం చుడతామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధి కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన సర్పంచ్ మడావి శాంతాబాయి ఇంటిని ఆయన సందర్శించారు.
సీఎం జూన్ 2న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కాగజ్నగర్ ఎక్స్రోడ్, కాగజ్నగర్ మండలం దాదానగర్, ఎస్పీఎం క్రీడా మైదానంలో సభాస్థలాలను పరిశీలించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రితో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సామూహిక ఇందిరమ్మ ఇళ్ల ప్రారంబోత్సవ పండుగను జరుపుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కలెక్టర్ హరిత పాల్గొన్నారు.


