పోతే ఉద్యోగం పోతుంది అంతేగా..
తరగతి గదిలోనిద్రపోతున్నప్రధానోపాధ్యాయినిని
ప్రశ్నించిన గ్రామస్తులకు బదులిచ్చిన వైనం
జిన్నారం (పటాన్చెరు): విద్యార్థులకు చదువు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయిని తరగతి గదిలో నిద్ర పోవడంతో గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురై ‘నేనింతే.. ఇలాగే నిద్రపోతా..’అని సమాధానమివ్వడంతో విస్తుపోయారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని వీరారెడ్డిపల్లిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మానస ప్రధానోపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తరగతి గదుల్లో నిద్రపోతున్నారు.
బుధవారం మధ్యాహ్నం మళ్లీ అలాగే నిద్రపోవడంతో గ్రామస్తులు ఆమెను నిలదీసారు. దానికి ఆమె స్పందిస్తూ.. ‘ఏంటీ.. ఏం చేస్తారు.. పోతే ఉద్యోగం పోతుంది అంతేగా‘అంటూ అక్కడి నుండి వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. విద్యార్థులు సైతం తమ ఉపాధ్యాయిని రోజూ చదువు చెప్పడం లేదని.. ఎప్పుడూ నిద్ర పోతుంటారని.. దీంతో తరగతి బయట వరండాలో కూర్చొని చదువుకుంటున్నామని చెప్పారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రధానోపాధ్యాయినిపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


