సాక్షి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ జ్యువెలరీ షాపు కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. నిందితులందరినీ కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. చోరి నిందితులను బిహార్, బెంగాల్లో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కరీంనగర్ సీపీ మీడియాతో మాట్లాడారు. "నిందితులు ఆరు రాష్ట్రాల్లో చోరీలు చేశారు. బంగారం వ్యాపారస్థునితో పాటు మరో నలుగురు నిందితులను అరెస్టు చేశాం. మెుత్తం ఈ నెట్వర్క్లో 17 మంది ఉన్నట్లు గుర్తి్ంచాం. చోరిలో 12 మంది నిందితులు పాల్గొన్నారు. పట్టుబడిన నిందితులపై 48 కేసులు ఉన్నాయి. దొంగలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోరీ చేసేందుకు ప్లాన్ వేశారు. దొంగతనంలో మెుత్తం 13 మంది దొంగలు పాల్గొనగా వారిలో ముగ్గురిని అరెస్టు చేశాం అన్నారు.
ఈ దోపిడీ సుభోద్ సింగ్ అనే వ్యక్తి మార్గదర్శకంలోనే జరిగింది. 12 రోజుల పాటు ఆపరేషన్ చేపట్టి దొంగలను పట్టుకున్నాం. దొంగలంతా రెండు నెలల క్రితమే రాష్ట్రానికి వచ్చారని పక్కా ప్లాన్ ప్రకారమే దోపిడీ చేశారని కరీంనగర్ సీపీ పేర్కొన్నారు. కాగా ఈ దొంగల ముఠా కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులో పట్టపగలే తుపాకీలతో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


