MLA Seethakka: సీతక్కకు తప్పిన ప్రమాదం
ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకు శనివారం ఆమె ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి జంపన్నవాగు మీదుగా పడవలో వెళ్లారు. ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేసి కార్యకర్తలతో కలసి తిరిగి వస్తున్న క్రమంలో పెట్రోల్ అయిపోయి వాగుమధ్యలో పడవ ఇంజిన్ ఆగిపోయింది.
వరద ఉధృతికి పడవ వాగు ఒడ్డుకు కొట్టుకువచ్చి చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో ఆమె వెంట ఉన్న నాయకులు చెట్టు కొమ్మల సాయంతో సీతక్కను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పడవ ఆగిపోయిన సమయంలో సీతక్క ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉన్నారని, వరద ఉధృతికి పడవ చెట్టును ఢీకొట్టి ఆగిపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆమె వెంట ఉన్న వారు తెలిపారు.