సంగారెడ్డి: భార్య కాలును నరికిన భర్తను పోలీసులు జైలుకు పంపించారు. బుధవారం కేసుకు సంబంధించిన వివరాలు పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ వెల్లడించారు. చౌటకూర్ మండలం గంగోజీపేట గ్రామానికి చెందిన కుమ్మరి వీరమణి, దుర్గయ్య భార్యాభర్తలు. వీరిద్దరూ బతుకు దెరువు కోసం సంగారెడ్డిలోని కొత్ల చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానంతో తరచూ దుర్గయ్య గొడవపడేవాడు.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆవేశంతో దుర్గయ్య ఇంట్లో ఉన్న భార్య కుడికాలును గొడ్డలితో నరికాడు. అలాగే కుడి చేతిపై కూడా గాయపరిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన వీరమణిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారి కుమారుడు హరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని బుధవారం తద్ధాన్పల్లి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు.


