నర్మెట (తరిగొప్పుల): నాటు కోడి కూర వివా దం చివరికి తండ్రి ప్రాణం తీసింది. జన గామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జంగిలి రమేష్ (42) నాటుకోడిని తెచ్చి కోస్తా.. కూర వండమని మంగళవారం రాత్రి భార్య అనూషకు తెలి పాడు. ఇప్పటికే చేపల కూర వండాను.. రాత్రి పది దాటింది ఇప్పుడు వద్దు అని భర్తకు నచ్చచెప్పినా వినిపించుకోకుండా బూతులు తిట్టసాగాడు.
ఈ క్రమంలో అమ్మను ఎందుకు తిడుతున్నావని కొడుకు గణేశ్ అడ్డుతగిలాడు. కోపంతో కుమారుడిని సైతం బూతులు తిట్టడంతో ఆగ్రహావేశానికిలోనైన గణేష్ పక్కనే ఉన్న రోకలిబండతో తండ్రి తలపై బాదాడు. తీవ్ర గాయమవడంతో స్థానికులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. రమేష్ సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గుగులోతు శ్రీదేవి తెలిపారు.


